హన్మకొండ: ఇంధన స్వాలంబన దిశగా సోలార్, బ్యాటరీ స్టోరేజ్ సాంకేతికతల వైపు అడుగులు వేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. హనుమకొండలో నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వరుణ్ రెడ్డి ప్రసంగించారు. సమష్టి కృషితో 33 కేవీ 11 కేవీ లైన్లలో విద్యుత్ అంతరాయాలను 36 శాతం వరకు తగ్గించగలిగామన్నారు. కవర్డ్ కండక్టర్లు, ఓల్టేజ్ బూస్టర్లు, నూతన సబ్స్టేషన్ల నిర్మాణం ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యత పెరిగిందన్నారు. సామాజిక బాధ్యతగా 10,345 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు అందించడం సంతృప్తినిచ్చిందన్నారు. రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్స్, జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ తుది దశకు చేరిందన్నారు. నిజామాబాద్ జక్రాన్పల్లిలో మొట్టమొదటి సోలార్ ప్లాంట్ నెలకొల్పామని చెప్పారు. ఎల్సీ యాప్ ద్వారానే ఎల్సీలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల భద్రతకు శ్రీవన్ మినిట్ రూల్ తీసుకువచ్చామని చెప్పారు. భద్రతా మౌలిక సదుపాయాలకు రూ.57.97 కోట్ల ఖర్చు చేసినట్లు వివరించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1912 నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐ వాయిస్ ఏజెంట్ను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సంస్థ నష్టాలు రూ.1,370 కోట్ల నుంచి రూ.670 కోట్లకు తగ్గాయని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సీఈలు తిరుమల్రావు, జయవంత్ రావు చౌహన్, అశోక్, మాధవరావు, సురేందర్, అన్నపూర్ణ, గౌతమ్ రెడ్డి, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణు బాబు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో వైద్యులు,
విద్యార్థుల పాత్ర కీలకం
కాశిబుగ్గ: దేశాభివృద్ధిలో వైద్యరంగం, వైద్యులు, విద్యార్థుల పాత్ర కీలకమని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రమేష్రెడ్డి అన్నారు. వరంగల్ కాళోజీ హెల్త్ వర్సిటీలో శనివారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వందన పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


