
ఎలుగుబంటి మృతి కేసులో ఒకరి అరెస్ట్
కాటారం: మహాముత్తారం మండలం యత్నారం అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి మృతి చెంది కళేబరం లభ్యమైన కేసులో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పెగడపల్లి రేంజర్ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. యత్నారం కొండెంగలవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 14న పలువురు గ్రామస్తులు ఎలుగుబంటి కళేబరం గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి పక్కనే విద్యుత్ తీగ ఉచ్చు ఉండటంతోపాటు మాంసం, గోర్లు తీసుకెళ్లిన దుండగులు కేవలం కళేబరం మిగిల్చారు. పంచనామా, పోస్టుమార్టం చేయించిన అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు కోణాల్లో విచారణ ప్రారంభించిన అధికారులు ఎలుగుబంటి మృతికి సంబంధం ఉందని యత్నారం గ్రామానికి చెందిన మంగూనాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. బుధవారం కాటారంలోని పెగడపల్లి రేంజ్ కార్యాలయంలో మంగునాయక్ అరెస్ట్ చూపించి రిమాండ్కు తరలించారు. పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నామని సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని రేంజ్ అధికారి తెలిపారు. కాగా, మంగూనాయక్ అరెస్ట్ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు రేంజర్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మంగూనాయక్పై అక్రమంగా అధికారులు కేసు పెట్టారని కుటుంబ సభ్యులు ప్రమీల, జగత్సింగ్, సురేందర్ అన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తడి ఎక్కువగా ఉందని, నీవు ఒప్పుకొని కేసు నీపై వేసుకుంటే బెయిల్కు అయ్యే ఖర్చులు సగం తాము భరిస్తామని అటవీశాఖ అధికారులు తనను ఇబ్బంది పెట్టారని అరెస్ట్ అయిన మంగూనాయక్ విలేకర్ల ఎదుట ఆరోపించారు.
అక్రమంగా కేసు పెట్టారని
కుటుంబ సభ్యుల ఆరోపణ