'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్‌కు అర్చకుల సూచన | Why Kantara Movie Shooting Spot Issue | Sakshi
Sakshi News home page

'కాంతార'కు గండం.. రిషబ్‌కు అర్చకుల సూచన

Jun 16 2025 7:44 AM | Updated on Jun 16 2025 9:48 AM

Why Kantara Movie Shooting Spot Issue

పార్ట్‌–2 షూటింగ్‌లో అన్నీ అవరోధాలు

వివాదాలు, సినీ నటులు మరణాలు

రిషబ్‌కు అర్చకుల సూచన.. చర్చనీయాంశమైన వైనం
 

రిషబ్‌ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార ఎంత హిట్‌ అయ్యిందో తెలియనిది కాదు, చిన్న బడ్జెట్‌తో తీస్తే కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. దేశంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి కాంతార: చాప్టర్‌ 1 పేరుతో పార్ట్‌ 2 తీస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అనుకున్నట్లు సాగడం లేదు. ప్రారంభం నుంచి అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు ఈ సినిమాకు ఎదురవుతున్నాయి. జూనియర్‌ ఆర్టిస్టు కపిల్‌, నటుడు రాకేశ్‌ పూజారి, మిమిక్రీ కళాకారుడు నిజు వీకే ఈ సినిమాలో నటిస్తూ, ఆకస్మికంగా మరణించారు. ఇంతలో శనివారం రాత్రి షూటింగ్‌ చేస్తున్న పడవ మునిగిపోయింది.

ఆర్టిస్టుల ఆకస్మిక మరణాలు

● కేరళకు చెందిన ఎంఎఫ్‌ కపిల్‌ జూనియర్‌ ఆర్టిస్టుగా ఈ కాంతారా చాప్టర్‌ 1లో నటిస్తూ ఉండేవాడు. ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సౌప ర్ణికా నదిలో కపిల్‌ ఈత కొడుతూ నది లో మునిగి చనిపోయాడు. మే 6న సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.

● కామెడి కిలాడిగళు ద్వారా పేరు పొందిన రాకేశ్‌ పూజారి మంచి హాస్యనటుడు. ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మే 12న ఉడుపిలో ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. హీరో రిషబ్‌ శెట్టి ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని రాకేశ్‌ ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేశారు.

● సరిగ్గా నెలరోజులకు జూన్‌ 12న కాంతార చాప్టర్‌ 1లో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు నిజు వికే మరణించాడు. ఆగుంబే హోం స్టేలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో తనువు చాలించారు.

ప్రమాదాలు సైతం

● గతేడాది నవంబర్‌లో కొల్లూరు మార్గంలో షూటింగ్‌ సభ్యులతో వెళుతున్న బస్సు పల్టీ కొట్టింది. 20 మంది జూనియర్‌ ఆర్టిస్టులు గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.

● కాంతార చాప్టర్‌ 1 సినిమా కోసం కుందాపుర వద్ద భారీ సెట్‌ ఒకటి వేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్లను నిర్మించారు. అయితే సుడిగాలుల కారణంగా సెట్‌ ధ్వంసం అయి ఆస్తి నష్టం కలిగింది.

● హాసన్‌జిల్లా హెరూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో గోమాళ స్థలంలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు వివాదం రాజుకుంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం అడవులను నాశనం చేస్తున్నారని, పేలుళ్లు జరిపారని గ్రామస్తులు ధర్నా చేశారు. అటవీ శాఖాధికారులు కూడా తనిఖీ చేశారు.

రిషబ్‌కు అర్చకుల సూచన
రిషబ్‌ శెట్టి కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్‌ వారాహి పంజుర్లి , జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రిషబ్‌ శెట్టికి అర్చకులు హెచ్చరికలు ఇచ్చినట్లు తెలిసింది. నీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయి అని పేర్కొన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, సినిమాను ఎలాగైనా అక్టోబర్‌ 2న విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కష్టాలు అంతటా హాట్‌ టాపిక్‌ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement