
విశాల్, దుషారా విజయన్
విశాల్ హీరోగా 35వ సినిమా షూటింగ్ షురూ అయింది. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్పై రూపొందుతోన్న 99వ చిత్రమిది. ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం చెన్నైలో జరిగాయి. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (ఎన్హెచ్ 4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం), నటులు కార్తీ, జీవా, కెమెరామేన్ ఆర్థర్ ఎ విల్సన్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
‘‘మద గజ రాజా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విశాల్ నటిస్తున్న చిత్రమిది. విశాల్, దర్శకుడు రవి అరసు కాంబినేషన్లో మొదటి సినిమా ఇది. ‘మద గజ రాజా’ తర్వాత విశాల్, సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం.నాథన్ ఈ సినిమా కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అలాగే ‘మార్క్ ఆంటోనీ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ మరోసారి ఈ సినిమా కోసం విశాల్తో కలిశారు. 45 రోజుల సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ను పూర్తి చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.