చాలామంది నటీనటులు, తమ చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాం, తమ జీవితం కళామతల్లికే అంకితం లాంటి మాటలు చెబుతూ ఉంటారు. కొందరు మాత్రమే కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడీ లిస్టులోకి తమిళ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని చేరేలా కనిపిస్తున్నాడు. తన భవిష్యత్ గురించి చేసిన తాజా వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ.
(ఇదీ చదవండి: 'రెబల్' విషయంలో ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే)
'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని.. అంతకు ముందు సంగీత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతానికైతే హీరోగా అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'నూరు సామి'. తెలుగులో 'వంద దేవుళ్లు' పేరుతో రిలీజ్ కానుంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ.. రాబోయే రెండు మూడేళ్లలో చెన్నై వదిలేసి, పల్లెటూరిలో స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పాడు. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు ఏ స్టార్ కూడా తీసుకోడు.
'నాకు ఎప్పటినుంచి సాధారణంగా బతకడంపై ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల కారణంగా చెన్నైలో ఉంటున్నాను. శ్రీధర్ వెంబు.. టెంకాశీలో స్థిరపడినట్లు నేను పొల్లాచ్చి లాంటి ప్రాంతంలో నివసించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే ఏదైనా గ్రామంలో భూమి కొనేందుకు చూస్తున్నాను. గ్రామ జీవితం నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య అనుబంధం లాంటి మంచి విషయాలు గ్రామాల్లో ఉన్నాయి' అని విజయ్ ఆంటోని పేర్కొన్నారు.
ఇకపోతే విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోనీ.. మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటినుంచి విజయ్ ఆంటోని ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చేసింది. సినిమాలు కూడా చాలా తగ్గించేశాడు. చూస్తుంటే రాబోయే రెండేళ్లలో పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసి ఏదైనా పల్లెటూరిలో స్థిరపడిపోతాడేమో?
(ఇదీ చదవండి: రామ్ చరణ్ని సర్ప్రైజ్ చేసిన కూతురు)


