'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ గురించి ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికంటే ముందు తీసిన 'రెబల్' చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. నిర్మాతలు, దర్శకుడు రాఘవ లారెన్స్ మధ్య అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. చెప్పిన బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చు పెట్టించాడని, అలానే బెదిరిస్తున్నాడని నిర్మాతలే స్వయంగా లారెన్స్పై పోలీసు కేసు కూడా పెట్టడం అప్పట్లో టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'రెబల్' గురించి మాట్లాడిన నిర్మాతలు భగవాన్, పుల్లారావు.. మరోసారి పాత విషయాలు గుర్తుచేసుకున్నారు.
(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)
'లారెన్స్ మీద కోపంగానే ఉన్నాం. మేం ఒక బడ్జెట్ అనుకున్నాం. సగం సినిమా అయ్యేసరికి అది అయిపోయింది. ఇది పెద్ద లాస్ అని నిర్మాతలుగా మాకు అప్పుడే తెలిసిపోయింది. అయినా సరే మేం ఎక్కడా దాన్ని వదిలిపెట్టకుండా ముహూర్తం నాడు ఎంత ఉత్సాహంగా ఉన్నామో అలానే పూర్తి చేసి రిలీజ్ చేశాం. లారెన్స్ పేరు ప్రభాస్కి మేమే ముందు చెప్పాం. మంచి కాంబినేషన్ అవుతుందని నమ్మాం. కానీ ప్రభాస్ వాళ్ల నాన్న మాత్రం.. లారెన్స్తో మీరు పడలేరు, వద్దయ్యా అనేవారు. వేరే ఎవరైనా డైరెక్టర్ని ఆలోచించండి అనేవారు. ఆయనతోనే చేస్తామని మేం అనేసరికి, సరే మీ ఇష్టం అని ప్రభాస్ తండ్రి వదిలేశారు'
'ప్రభాస్ దేవుడు లాంటి మనిషి. 'రెబల్' కోసం జరిగిందంతా చూశారు. దీంతో మీరు చాలా కష్టపడ్డారు. మీకు మరో సినిమా తప్పకుండా చేస్తానని మాటిచ్చారు. కానీ ఆ ప్రామిస్ని ఇంకా ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పటికీ ప్రభాస్తో మాకు అనుబంధం కొనసాగుతోంది. ప్రతి పండగకు విషెస్ చెబుతుంటారు' అని నిర్మాతలు జె.భగవాన్, జె. పుల్లారావు చెప్పుకొచ్చారు.
చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో నిర్మాతలుగా ఉన్న వీళ్లు.. జంబలకడిపంబ, మావిడాకులు,సముద్రం, మనసున్న మారాజు, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, జూనియర్స్, శంఖం, రెబల్, గౌతమ్ నంద, రిపబ్లిక్ లాంటి సినిమాలని నిర్మించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


