హైదరాబాద్‌ అంటే బిర్యానీయే కాదు: రేవంత్‌ రెడ్డి | Telangana CM Revanth Reddy Speech at Gaddar Awards 2026 | Sakshi
Sakshi News home page

Revanth Reddy: అందుకే ఈ అవార్డులకు గద్దర్‌ పేరు పెట్టాం!

Mar 19 2026 11:47 PM | Updated on Mar 19 2026 11:49 PM

Telangana CM Revanth Reddy Speech at Gaddar Awards 2026

హైదరాబాద్‌ అంటే ఐటీ, ఫార్మా, బిర్యానియే కాదు.. దేశస్థాయిలో సినీపరిశ్రమకు హైదరాబాద్‌ కేంద్రంగా రాణించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. జపాన్‌, కొరియా లాంటి దేశాల్లో ఫిలిం ఇండస్ట్రీ కోసం ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయని, అదే తరహాలో మన ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన గద్దర్‌ అవార్డుల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 

ఆ నలుగురే కారణం
ఈ వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్న సినీపరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడానికి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కృష్ణ.. ప్రధాన కారణం. సినీ కార్మికులు ఇల్లు కట్టుకునేందుకు ప్రభాకర్‌ రెడ్డి తన సొంత స్థలాన్ని దానం చేశారు. సినీపరిశ్రమలో ఏ సంక్షోభం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు వాటిని పరిష్కరించి.. శాశ్వతంగా ఇండస్ట్రీని హైదరాబాద్‌ నగరంలో నిలిపేందుకు కృషి చేశారు.

సంతోషం
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి, పుష్ప వంటి సినిమాలు జాతీయ స్థాయిలో మన సినీ పరిశ్రమను నిలబెట్టాయి. అలాంటి ఇండస్ట్రీ కోసం ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గతేడాది గద్దర్‌ పురస్కారాలను ప్రవేశపెట్టాం. వరుసగా రెండోసారి ఈ అవార్డులను అందించాం. ఈ కార్యక్రమానికి ఖుష్బూ, జయసుధ వంటి వారు రావడం సంతోషం. నాగచైతన్య, రష్మిక అందరూ యంగ్‌స్టర్స్‌. వీళ్లకు అవార్డులు ఇచ్చేందుకు వచ్చిన సీనియర్స్‌ అందరినీ అభినందిస్తున్నాను.

సూచన
హైదరాబాద్‌లో.. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసేవారికి అన్నిరకాల అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సింగిల్‌ విండో విధానాన్ని తీసుకొస్తుంది. ఆన్‌లైన్‌లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా ఒక ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతున్నాను. ఇకపోతే గద్దర్‌ ఒక ప్రజాయుద్ధ నౌక.. ఆయన పేరు కోట్లాదిమందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించింది.

సమాజంలోని సమస్యలపై సినిమా
ఆయన గళం తెలియనివారు దేశంలో లేరు. గద్దర్‌ ఒక చైతన్యం, స్ఫూర్తి. అందుకే ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టాం. సినిమా అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సమాజంలోని సమస్యలపై పోరాడేందుకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలి అని రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

అవార్డుల వేడుక
'గద్దర్‌ ఫిలిం అవార్డ్స్‌ 2025'  కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్‌ హాసన్‌, నాగార్జున, రాంచరణ్‌, ఖుష్బూ, నాగచైతన్య, అల్లు అరవింద్‌, దిల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement