దర్శన్‌ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్‌ | Sumalatha Ambareesh Finally Reacts On Darshan Arrest In Renuka Swamy Murder Case, Deets Inside | Sakshi
Sakshi News home page

Sumalatha On Darshan Arrest: దర్శన్‌ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్‌

Jul 5 2024 7:09 AM | Updated on Jul 5 2024 9:57 AM

Sumalatha Comments On Darshan

ఆటో డ్రైవర్‌ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్‌ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. ఈ కేసులో 17 మంది  జైలులో ఉన్నారు. ఇప్పటికే దర్శన్‌ అరెస్ట్‌ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ, రాజకీయ నాయకురాలు, సినీ నటి సుమలత అంబరీష్ స్పందన గురించి చాలామంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె రియాక్షన్‌ ఇచ్చారు. దర్శన్‌తో తనకు ఉన్న బంధాన్ని ఆమె వివరించారు.

'నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్‌. నా కుటుంబంతో దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు. అతను స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కి మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటివాడు. అంబరీష్‌ని ఎప్పుడూ నాన్నగా పిలిచే ఆయన జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు. 

నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. దర్శన్‌లో ప్రేమ, ఉదార ​​హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం అతని పాత్రకు సాక్ష్యమిస్తున్నాయి. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను.' అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై వ్యాఖ్యానించనని పేర్కొన్నారు.

దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిని సుమలత తప్పుబట్టారు. అలాంటి వారిని విమర్శిస్తూ సుమలత తన లేఖను ముగించారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్‌ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్‌ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్‌ స్థంభించిపోయింది.' అని ఆమె రాశారు.

18 వరకు దర్శన్‌కు కస్టడీ
రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న హీరో దర్శన్‌, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.  దర్శన్‌, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్‌ గ్యాంగ్‌కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement