‘‘రెగ్యులర్ రవితేజగారి సినిమాల్లా కాకుండా పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లాగా తీసుకురావాలనే ఉద్దేశంతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని ప్రారంభించాం. ఈ సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి సంక్రాంతి సీజన్లో డిమాండ్ ఉంటుందని ఈ సంక్రాంతితో మరోసారి రుజువైంది. సెకండ్ వీక్ నుంచి మా మూవీ రన్ ఇంకా అద్భుతంగా ఉండబోతోంది.
ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉంది’’ అని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ అయింది.
ఈ సందర్భంగా సోమవారం సుధాకర్ చెరుకూరి విలేకరులతో మాట్లాడుతూ–‘‘సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రావాలనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ని మొదలుపెట్టాం. కేవలం 65 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్లో చిత్రీకరణ పూర్తి చేశాం. మా సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కూడా చాలా సంతోషంగా ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది.
సంక్రాంతికి విడుదలైన ‘ది రాజా సాబ్, మనశంకర వరప్రసాద్గారు, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి’ సినిమాలన్నీ విజయం సాధించడం గొప్ప విషయం ఇది. ఈ సినిమా ప్రమోషన్స్కి రవితేజగారు, కిషోర్, డింపుల్ హయతి, ఆషిక... ఇలా అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలో అందరూ గొప్పగా చెప్పుకునే సినిమా ఒకటి తీయాలనేది నా కల.
ఆ కల ‘ది ఫ్యారడైజ్’ చిత్రంతో తీరిపోతుందనే నమ్మకం ఉంది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కలిసి చేస్తున్న సినిమా అద్భుతంగా వస్తోంది. నానిగారి ‘ది ఫ్యారడైజ్’ మూవీ తర్వాత చిరంజీవిగారి సినిమా మొదలుపెడతాం. అలాగే కిషోర్ తిరుమలగారి దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ చేయబోతున్నాం. నాకు ‘అరుంధతి’ లాంటి సినిమా చేయాలని ఉంది. అలాంటి కథపై ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను నిర్మించిన ‘కేజేక్యూ’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’ అని చెప్పారు.


