
ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్లో సందడి చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్తో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అక్కడే ఉన్నారు. తాజాగా లండన్లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మూవీ ప్రదర్శనతో పాటు ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఆర్ ఫరెవర్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
మే 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా కనిపించారు. నాటు నాటు సాంగ్ ప్లే అవుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత రాజమౌళిని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఉన్నారు.
ఈ సందర్భంగా ఉపాసన ఆర్ఆర్ఆర్-2 చేస్తారా? అంటూ రాజమౌళిని అడిగింది. దీనికి రాజమౌళి అవును అని సమాధానమిచ్చారు. ఉపాసన వెంటనే 'గాడ్ బ్లెస్ యూ' అంటూ వారిని దీవించింది. ఈ సరదా వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ ఈవెంట్లో ఆస్కార్ స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. దాదాపు మూడేళ్ల తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటిసారి వేదికపై తిరిగి కలిశారు.
ఇక సినిమాల విషయానికొస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో జతకట్టారు. ఈ సినిమా జూన్ 25, 2026న విడుదల కానుంది. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు.