మంచి కాన్సెప్ట్‌ లేకపోతే సినిమా తీయను

Srujan Yarabolu Comments On Adbutham Movie - Sakshi

‘‘పంపిణీ రంగం నుంచి నిర్మాతగా మారినందుకు హ్యాపీగా ఉంది. ఓవర్‌సీస్‌లో సినిమాలను విడుదల చేయడంవల్ల కొన్నిసార్లు నిర్మాతలకంటే మాకే ఎక్కువ డబ్బులు వచ్చేవి. నాకు కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలంటే ఇష్టం. మంచి కాన్సెప్ట్‌ లేకపోతే సినిమా తీయను’’ అన్నారు నిర్మాత సృజన్‌ యరబోలు. తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన ‘అద్భుతం’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది.

ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సృజన్‌ మాట్లాడుతూ– ‘‘నేనుయూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని. జాబ్‌ చేస్తూనే సినిమాలు నిర్మిస్తున్నాను. ‘‘కంచె’ చిత్రాన్ని ఓవర్‌సీస్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేయడంతో నా జర్నీ మొదలైంది. ఆ తర్వాత ‘అర్జున్‌రెడ్డి’, ‘మహానటి’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’.. ఇలా దాదాపు ముప్ఫై సినిమాలను ఓవర్‌సీస్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేశాను. ఆ తర్వాత నిర్వాణ బ్యానర్‌లో భాగమై తీసిన ‘మను’, ‘సూర్య కాంతం’ ఆడలేదు. ఇప్పుడు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ స్టార్ట్‌ చేశాను. మా బ్యానర్‌లో ప్రస్తుతం ఎనిమిది ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘పంచతంత్రం’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. బ్రహ్మానందంగారి తనయుడు గౌతమ్‌తో సినిమా చేస్తున్నాం. సంతోష్‌ శోభన్‌తో సినిమా ఉంది. ‘గతం’ దర్శకుడు కిరణ్‌తో ఆల్రెడీ ఓ సినిమా తీశాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం ‘స్కైలాబ్‌’ చిత్రాన్ని ఓవర్‌ సీస్‌లో పంపిణీ చేస్తున్నాం. కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే ఓవర్‌ సీస్‌ మార్కెట్‌ కోలుకుంటోంది. పెద్ద చిత్రాలు రిలీజైతే మరింత మెరుగుపడుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top