నట సాహస మణిమకుటం 'శ్రీకృష్ణ పాండవీయం' | Some interesting facts you may not know about Sri Krishna Pandaviyam, who has completed 60 years | Sakshi
Sakshi News home page

'శ్రీకృష్ణ పాండవీయం' @60 ఏళ్ళు

Jan 18 2026 9:32 AM | Updated on Jan 18 2026 10:39 AM

Some interesting facts you may not know about Sri Krishna Pandaviyam, who has completed 60 years

తెలుగు సినిమా మాట నేర్చిననాటి నుంచి వెండితెరపై పురాణకథలు ప్రేక్షకులకు కొత్త కావు. అయితే, మాటల్లో కొంటెతనం – చేతల్లో చాతుర్యం – మనసంతా పాండవ పక్షపాతం – నడకలో, చూపులో లలిత లావణ్యం నిండిన శ్రీకృష్ణ పాత్ర ఒకటి. అహంకార జనిత దర్పం, అధికార జనిత మదోన్మత్తత, ఆభిజాత్యం నిండిన నడక – నడత, పరాభవ దగ్ధ మానసుడైన మత్సరగ్రస్థ మానిషి సుయోధన పాత్ర వేరొకటి. పరస్పరం పూర్తి విభిన్నమైన ఈ నాయక – ప్రతినాయక పాత్రలను రెంటినీ ఒకే నటుడు ఒకే చిత్రంలో ధరించేందుకు సాహసిస్తే? అత్యంత శ్రద్ధ, అపారమైన అధ్యయనంతో అనితర సాధ్యంగా ఆ పాత్రలకు ప్రాణం పోస్తే? ఖర్చుకు వెనుకాడకుండా ఆ కళాతపస్సుకు నిర్మాత – దర్శకుడిగా తన ఆలోచనల అంతర్నేత్రంతో అద్భుతంగా నిర్దేశకత్వం వహిస్తే? ఎన్టీఆర్‌ తన శక్తియుక్తులను ధారపోసి చేసిన ఆ అపురూప సినీసృష్టి విన్యాసం... ‘శ్రీక్రిష్ణ పాండవీయం’. సరిగ్గా 60 ఏళ్ళ క్రితం 1966 జనవరి 13న విడుదలైన ఆ చిత్రం ఎన్టీఆర్‌ నటన – నిర్దేశకత్వాలకు మకుటాయమానం. ఆయన బహుముఖ ప్రజ్ఞకు వెండితెర దర్పణం. అందుకే, తెలుగు ΄ûరాణిక సినిమాల్లో అది ఈనాటికీ అత్యంత ప్రత్యేకం. ఎన్టీఆర్‌ స్వర్గస్థులై ఈ జనవరి 18తో 30 ఏళ్ళు నిండిన వేళ... ఇది ఆ మరపురాని సినీ విశేషాల సమాహార కథనం.

పదిమందికీ తెలిసిన పురాణకథనైనా పకడ్బందీ స్క్రీన్‌ప్లే రాసి, నట – సాంకేతిక నైపుణ్యంతో తెరపై రస΄్లావితంగా కళ్ళకు కడితే దానికి వచ్చే స్పందనే వేరు. ‘శ్రీక్రిష్ణ పాండవీయం’లో జరిగింది అక్షరాలా అదే! నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా అన్ని పాత్రలకూ ఎన్టీఆర్‌ సమన్యాయం చేసిన సమయం అది. నట, సాంకేతికుల ప్రతిభ సమపాళ్ళలో సంగమించిన సందర్భం అది. అందుకే, ఆ చిత్రం... వెండితెర పురాణమైంది. సమష్టి కృషితో కళాఖండమైంది. ΄ûరాణిక చిత్ర రూపకర్తలకు పాఠ్యగ్రంథమైంది.  

కళాతృష్ణతో... సుయోధన పాత్రకు శ్రీకారం!  
‘పాండవీయం’ రావడానికి ముందే ఆ సమీప కాలంలో తెలుగు తెరపై ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘బభ్రువాహన’, ‘ప్రమీలార్జునీయం’, ‘వీరాభిమన్యు’ లాంటి మహాభారత గాథలు తెరకెక్కాయి. ప్రజాదరణ ΄పోందాయి. ‘పాండవ వనవాసం’ (1965)లో భీముడిగా ఎన్టీఆర్, దుర్యోధనుడిగా ఎస్వీఆర్‌ ఢీ అంటే ఢీ నటన ప్రదర్శించారు. ఆ తర్వాత తనదైన శైలిలో దుర్యోధన పాత్రను అపూర్వ రీతిలో పోషించి, నటుడిగా తన కళాతృష్ణ తీర్చుకోవాలని ఎన్టీఆర్‌ భావించారు. అదిగో... అలా ‘పాండవీయం’కి బీజం పడింది. భారీ వ్యయంతో వచ్చిన సమకాలీన చిత్రాలు ‘నర్తనశాల’ (1963), ‘పాండవ వనవాసం’, ‘వీరాభిమన్యు’ (1965)లకు సెట్టింగుల మొదలు చిత్రీకరణ దాకా ఎక్కడా తీసిపోకుండా నయన మనోహరంగా ‘పాండవీయం’ రూ΄పోందించారు ఎన్టీఆర్‌. చిత్రమేమంటే, ‘పాండవీయం’ ఘనవిజయం తర్వాత ఎస్వీఆర్‌ సైతం దుర్యోధన పాత్ర ధరిస్తూ, స్వీయ నిర్మాణ – దర్శకత్వంలో ‘రారాజు’ పేరిట సినిమాగా తీస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. కానీ, ఆ ్రపాజెక్ట్‌ కార్యరూపం దాల్చలేదు.  

డైరెక్టర్‌గా... తెరపై తొలిసారి పేరు!  
నిజానికి, ఎన్టీఆర్‌ దర్శకత్వంలో రూ΄పోందిన మూడో చిత్రం ‘శ్రీక్రిష్ణ పాండవీయం’. అయితే, తెరపై టైటిల్స్‌లో దర్శకుడిగా ఆయన పేరు తొలిసారి కనిపించింది ఈ చిత్రంతోనే! అంతకుముందే ‘సీతారామ కల్యాణం’(1961), ‘గులేబకావళి కథ’ (’62)కు దర్శకత్వం వహించినా... ఈ సినిమాకే ఆయన తొలిసారి డైరెక్టర్‌గా తన పేరు వేసుకున్నారు. ఇంకా చె΄్పాలంటే, పెద్దల బలవంతాన వేసుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌ రాముడిగా, ఎస్వీఆర్‌ రావణుడిగా ‘సీతారామ కల్యాణం’ చిత్రానికి ఆయన గురువు కె.వి. రెడ్డి దర్శకత్వం వహించాలి. కానీ, ఆ సొంత సినిమాలో రావణుడి పాత్ర ధరించాలని ఎన్టీఆర్‌ ముచ్చటపడ్డారు. కె.వి. రెడ్డి ససేమిరా అన్నారు. ఆయన దర్శకత్వం వహించననడంతో, తప్పనిసరై ఆ బాధ్యతలు తానే తీసుకొని, కళా తృష్ణ తీర్చుకోవడమే కాక, దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. 
 

ఆ తర్వాత ‘గులేబకావళి కథ’కూ డైరెక్టర్‌గా టైటిల్‌ కార్డ్‌ మాత్రం వేసుకోలేదు. ముచ్చటగా మూడోసారి చేస్తున్న ‘పాండవీయం’కి కూడా డైరెక్టర్‌ పేరు లేకుండానే ఎన్టీఆర్‌ ముందుకెళ్ళారు. అప్పట్లో ‘సౌతిండియన్‌ ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌’కు ప్రెసిడెంట్‌ దర్శకుడు పి. పుల్లయ్య. ఇలా డైరెక్టర్‌ పేరు లేకుండా సినిమాలు రావడం ఒక రకంగా దర్శకత్వ శాఖకే అగౌరవమని పుల్లయ్య అనడంతో, పెద్దల మాట గౌరవిస్తూ ఎన్టీఆర్‌ అప్పటి నుంచి పేరు వేసుకోసాగారు. ఎన్టీఆర్‌ అప్పటి దాకా ‘ఎన్‌.ఏ.టి.’ పతాకంపై సినిమాలు తీస్తూ వచ్చారు. ఈ సినిమాకు కొంతకాలం ముందే కుమారుడు రామకృష్ణ దురదృష్టవశాత్తూ మరణించారు. కొడుకు చనిపోయాక ఎన్టీఆర్‌ నిర్మించిన తొలి సినిమా ‘పాండవీయ’మే! అందుకే, నిర్మాణసంస్థ పేరులో తొలిసారి ‘రామకృష్ణ’ అని చేర్చారు.

భారత, భాగవతాల మేళవింపు 
లక్క ఇంటి దహనం నుంచి శిశుపాల వధ దాకా తెరపై చూపించే ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ కథ కూడా చిత్రమైన వెండితెర వంటకం. భారతం, భాగవతం... రెంటినీ తీసుకొని, వాటిలోని ప్రధాన ఘట్టాలను కలిపి తీసిన సక్సెస్‌ఫుల్‌ సినిమా స్క్రిప్ట్‌. బకాసుర వధ, హిడింబాసుర వధ, ద్రౌపదీ స్వయంవరం, జరాసంధ వధ, శిశుపాల వధ లాంటి భారత ఘట్టాలు ఉన్నాయి. అదే సమయంలో భాగవతంలోని అద్భుతమైన రుక్మిణీ కల్యాణమూ సినిమాలో గుదిగుచ్చారు. తెలుగునాట ఇంటింటికీ సుపరిచితమైన పోతన భాగవతంలోని రుక్మిణీ కల్యాణ ఘట్టం ఓ  యెటిక్‌ క్లాసిక్‌. దాన్ని అంతే అద్భుతంగా, యథాతథంగా పోతన పద్యాలతోనే ‘పాండవీయం’లో తెరపైకి తెచ్చారు ఎన్టీఆర్‌. అలా తాను అద్భుతమైన నటుడినే కాక అభిరుచి గల రసజ్ఞుడైన దర్శకుడిననీ నిరూపించుకొన్నారు. రాజసూయ యాగం – మయసభ ఘట్టం లాంటివి అపూర్వంగా తెరపై చూపిన సినిమా కూడా ఇదే! ఇన్ని గాథలను ఒకే సినిమాలో బిగి చెడకుండా తెరకెక్కించిన తొలి బృహత్తర యత్నమూ ఇదే!  

కెరీర్‌ బెస్ట్‌ పాత్రల్లో ఒకటిగా...
మూడు దశాబ్దాల పైచిలుకు ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ను విశ్లేషిస్తే... సుయోధన పాత్రపోషణ నటుడిగా ఆయన కృషిలో కలికితురాయి. ముఖ్యంగా, ‘పాండవీయం’లోని ఆ పాత్ర కోసం ఆయన పురాణాలను సైతం శోధించారు. అంతకు మునుపటి చిత్రాల్లోని దుర్యోధన పాత్రకు భిన్నంగా ప్రత్యేకమైన వేష భూషణాలు, పాము పడగలతో తీర్చిదిద్దిన ఆ ప్రత్యేక కిరీటం – గద, నెన్నొసట దిద్దిన నాగతిలకం, నటనలో తనదైన శైలి, దైహిక భాష, సంభాషణోచ్చారణతో ఆ పాత్రను చిరంజీవిని చేశారు. ఒక రకంగా నాయక పాత్ర తరహా ఇమేజ్‌ను దానికి సంతరించిపెట్టారు.

ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం...
‘పాండవీయం’ చిత్ర నిర్మాణాన్ని ఎన్టీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో కలసి అత్యుత్తమ స్థాయి చిత్ర రూపకల్పన కోసం శ్రమించారు. సముద్రాల సీనియర్‌ ఈ చిత్ర రచన చేశారు. ‘నర్తనశాల’తో అంతర్జాతీయ అవార్డు అందుకున్న సీనియర్‌ కళాదర్శకుడు టి.వి.ఎస్‌. శర్మ ‘పాండవీయం’కు పనిచేశారు. కళ్ళు చెదిరే సెట్లు, కళాత్మకత ఉట్టిపడే మౌల్డింగులు, కిరీటాలు, వేష భూషణాలు సిద్ధం చేశారు. కురుసభ, మయసభ, రాజసూయ సభలను నేత్రపర్వంగా రూ΄పోందించారు. రవికాంత్‌ నగాయిచ్‌ ప్రతి సన్నివేశాన్నీ కనువిందుగా చిత్రీకరించారు. రెండు విభిన్న పాత్రలు ధరిస్తూ, దర్శకత్వం వహించడాన్ని ఎన్టీఆర్‌ సైతం గర్వకారణంగా భావించారు. ఎప్పటిలా కాక పబ్లిసిటీ సైతం భారీగా చేశారు.

నేటికీ వినిపించే పాటలు...
ఎన్టీఆర్‌కు చిరకాల సన్నిహితుడైన టి.వి. రాజు సంగీతం అందిస్తే, కొసరాజు – సి. నారాయణరెడ్డి సాహిత్యం సమకూర్చారు. హిడింబి పాడే ‘ఛాంగురే...’, అలాగే ‘స్వాగతం సుస్వాగతం...’ (ఈ రెంటి రచన సినారె), శ్రీకృష్ణుడు – రుక్మిణి పాత్రలపై వచ్చే ‘ప్రియురాల సిగ్గేలనే...’ (సముద్రాల సీనియర్‌) చాలా పాపులర్‌. ఇక, ఆదమరిచిన భీమసేనుణ్ణి అప్రమత్తం చేస్తూ శ్రీకృష్ణుడు పాడే ‘మత్తు వదలరా...’ పాట ఇవాళ్టికీ అందరూ తరచూ పేర్కొనే అద్భుత వ్యక్తిత్వపాఠ గీతం. పాటలకు వెంపటి సత్యం కూర్చిన నృత్యాలు మరో హైలైట్‌. ఈ చిత్రంలో తెర నిండుగా భారీ తారాగణమే. అలాగే, తరువాతి కాలంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన భారతి (కన్నడ హీరో విష్ణువర్ధన్‌ భార్య) సుయోధనుడి స్వాగత గీతంలో నర్తిస్తూ తెలుగులో తొలిసారి అలరించారు.  

విమర్శలున్నా... విజయమే!
పతాక సన్నివేశాల్లో శిశుపాలుడి వధ అనంతరం శ్రీకృష్ణుడి విశ్వరూప సందర్శనంతో 20 రీళ్ళ ‘పాండవీయం’ సినిమా ముగుస్తుంది. భారతంలో శ్రీకృష్ణ రాయబారం, కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీతా బోధ సందర్భాల్లోనే విశ్వరూప సందర్శన ఘట్టం ఉంటుంది. అయితే, మనవాళ్ళు మాత్రం సినిమాటిక్‌గా ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్వరూప సందర్శన చూపుతున్నారంటూ పండితులు వ్యాఖ్యానించారు. భాషాపరంగా ‘శ్రీకృష్ణ పాండవీయం’ అని ఉండాల్సిన టైటిల్‌ను ఉచ్చారణ సాకుతో ‘శ్రీక్రిష్ణ...’ అని రాయడం పైనా విమర్శలొచ్చాయి. అయితే, సామాన్యులకు అవేమీ పట్టలేదు. మూడున్నర గంటల నిడివినీ ఆసక్తిగా చూశారు. సూపర్‌హిట్‌ చేశారు.

ఆకస్మికంగా ప్రధాని మృతి... ఆగని రిలీజ్‌...
అది 1966 జనవరి. భారత్‌ – పాక్‌ల మధ్య శాంతి, సామరస్యాల సాధన కోసం భారత ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి తాష్కెంట్‌కు చర్చలకు వెళ్ళారు. ‘తాష్కెంట్‌ ఒప్పందం’ కుదిరిన కొద్ది గంటలకే జనవరి 11 తెల్లవారకుండానే ఆయన ఆకస్మికంగా మరణించారు. యావత్‌ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. సరిగ్గా అంతకు నెల రోజుల ముందే డిసెంబర్‌ 11 రాత్రి హైదరాబాద్‌ నిజామ్‌ కాలేజీలో జరిగిన సభలో సినీ బృందంతో ప్రధానిని కలిశారు. అప్పటికి 21 రోజులు రాష్ట్రమంతా తమ సినీ కళాకారుల బృందం పర్యటించి, ప్రజల నుంచి సేకరించిన రూ. 8 లక్షలను ‘జాతీయ రక్షణ నిధి’కి చెక్కుగా ప్రధానికి అందజేశారు. ఎన్టీఆర్‌ ఉద్వేగపూరితంగా ప్రసంగించి, ప్రధానిచే ‘నటరత్న’గా ప్రశంసలందుకున్నారు. అలాంటి శాస్త్రీజీ మరణ వార్తతో ఎన్టీఆర్‌ నివ్వెరపోయారు.

నిజానికి, డిసెంబర్‌లో మద్రాసు వాహినీ స్టూడియోలో లెక్కకు మించి ఆర్కెస్ట్రాను పెట్టి, సంగీత దర్శకుడు టి.వి. రాజు సారథ్యంలో ‘పాండవీయం’ రీ–రికార్డింగ్‌ పూర్తి చేయించి, సెన్సార్‌ కూడా పూర్తి చేయించి, సంక్రాంతి విడుదలకు సర్వం సిద్ధం చేశారు. మరో రెండే రోజుల్లో రిలీజ్‌. ఇంతలో అనుకోని ఈ దుస్సంఘటన. ఇప్పుడేం చేయాలి? ఆపేస్తే... సినీ వ్యాపారవర్గాలందరికీ ఎంతో నష్టం. అంతా ఆలోచించి, రిలీజ్‌కే ఓటేశారు. అలా శాస్త్రీజీ మరణించిన రెండు రోజులకు తెలుగు ‘పాండవీయం’ 1966 జనవరి 13న విడుదలైంది. సరిగ్గా ఆ మరునాడే ‘మోడరన్‌ థియేటర్స్‌’ వారి 102వ చిత్రంగా ఎస్‌.డి. లాల్‌ దర్శకత్వంలో ఎస్వీఆర్‌ నటించిన అపరాధ పరిశోధక చిత్రం ‘మొనగాళ్ళకు మొనగాడు’ రిలీజైంది. వీటి కన్నా ముందే ఆ ఏడాది జనవరి 7న అక్కినేని ‘జమిందార్‌’ రిలీజైంది. అన్నింటి మధ్య ఆ సంక్రాంతి చిత్రాల బరిలో ‘పాండవీయం’ ఘన విజయం సాధించింది. తెలుగు వెర్షన్‌ తర్వాత 1966 ఏప్రిల్‌ 30న తమిళ ‘రాజసూయం’ వచ్చింది. అయిదేళ్ళ తర్వాత ‘కణ్ణన్‌ కరుణై’ అని కొత్త టైటిల్‌తో 1971 జూన్‌ 18న మళ్ళీ భారీగా రిలీజ్‌ చేశారు.

ఆ రోజుల్లోనే... ప్రీక్వెల్స్‌!
గమనిస్తే... పద్ధెనిమిది పర్వాల మహాభారతంలోని ప్రధాన గాథలెన్నో తెలుగుతెరపై సినిమాలుగా వచ్చాయి. దేనికదే ప్రత్యేకం. అయితే, కేవలం 27 నెలల కాలవ్యవధిలో ఒక సినిమాకు ‘ప్రీక్వెల్‌’ కథతో మరో సినిమా చొప్పున ఏకంగా 3 సినిమాలు రావడం 1960లలో జరిగింది. ఆ 3 సినిమాల్లోనూ ఎన్టీఆర్‌ హీరో కావడం, మూడూ సూపర్‌హిట్లు కావడం విశేషం. అవి – ‘నర్తనశాల’ (రిలీజ్‌ 1963 అక్టోబర్‌ 11), ‘పాండవ వనవాసం’ (1965 జనవరి 14), ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ (1966 జనవరి 13). మూడూ మహాభారత ఆధారిత కథలే! భారతంలోని విరాటపర్వ గాథతో ‘నర్తనశాల’ తయారైతే, దానికి ముందుదైన అరణ్యపర్వ కథతో ‘పాండవ వనవాసం’ వచ్చింది. అటు తర్వాత అరణ్యపర్వానికి ముందువైన ఆది, సభా పర్వాల ఘట్టాలతో ‘పాండవీయం’ రూ΄పోందింది. కథాపరంగా చూస్తే, వరుసగా మూడూ ఒకదానికొకటి ప్రీక్వెల్సే!  

అన్నీ చేసిన... అరుదైన యాక్టర్‌!
ఇక, కృష్ణరాయబార ఘట్టం ఉండే ఉద్యోగపర్వం, భీష్మ – ద్రోణాది పర్వాల్లోని కురుక్షేత్ర యుద్ధం వగైరా అంతా ఎన్టీఆరే నటించిన ‘శ్రీకృష్ణావతారం’ (’67), ‘దానవీరశూర కర్ణ’ (’77)ల్లో చూపారు. అలా దాదాపు భారతంలోని అన్ని పర్వాలూ, వ్యాస–కవిత్రయ భారతాల నుంచి పోతన భాగవతం దాకా అన్నింటిలోని ప్రధాన అంశాలూ సినిమాతెరకెక్కాయి. అన్నింటిలో ఎన్టీఆరే పాత్రధారి. ‘భీష్మ’(’62), ‘శ్రీమద్విరాటపర్వం’(’79) కూడా కలుపుకొంటే... భీష్ముడు నుంచి బృహన్నల దాకా ప్రధాన భారత పాత్రలన్నీ ఎన్టీఆర్‌ పోషించి, నభూతో నభవిష్యతి అనిపించారు.

మళ్ళీ మళ్ళీ... అర్ధశత, శతదినోత్సవాలు
అరవై ఏళ్ళ క్రితం భారీ మొత్తం (దాదాపు రూ. 10 లక్షలు) వెచ్చించి, ‘పాండవీయం’ రూ΄పోందించారు. 30 ప్రింట్లతో తొలి రిలీజైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. రిలీజైన అన్ని కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవాలు, ఆ పైన 9 కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకొంది. తర్వాత అనేకసార్లు రీరిలీజై, తరతరాల పర్యంతం ఆకట్టుకొంటూనే ఉంది. వసూళ్ళ వాన కురిపిస్తూ వచ్చింది. తొలి రిలీజ్‌ 1966 తర్వాత ప్రధానంగా 1968, 1986, 1997ల్లో కూడా ‘పాండవీయం’ పెద్దయెత్తున ఏకకాలంలో వివిధ కేంద్రాల్లో మళ్ళీ వచ్చింది. ఫస్ట్‌ రిలీజ్‌ లానే 1968 నవంబర్‌ 1న సెకండ్‌ రిలీజ్‌ సైతం విజయవాడలోని దుర్గాకళామందిరంలోనే వచ్చింది. మళ్ళీ 50 రోజులు ఆడింది. 

ఇక, 1986 సంక్రాంతికి ఆంధ్రా – సీడెడ్‌లలో దాదాపు 20 ప్రింట్లతో ‘పాండవీయం’ రీరిలీజైంది. అప్పట్లో ఎన్టీఆర్‌ సొంత చిత్రాలు మూడింటికి (‘పాండవీయం’, ‘ఉమ్మడి కుటుంబం’, ‘తల్లా పెళ్ళామా’) కలిపి, అయిదేళ్ళ పంపిణీ హక్కులు రూ. 50 లక్షలకు అమ్ముడయ్యాయి. అందులో ఒక్క ‘పాండవీయం’ విలువే రూ. 40 లక్షలని ట్రేడ్‌ పండితుల మాట. అలా 1986 ఆరంభంలో రీ–రిలీజైనప్పుడు అప్పటికి ఇరవయ్యేళ్ళు నిండిన ఈ పాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రం కొత్త కలర్‌ చిత్రాలతో సైతం ఢీ అంటే ఢీ అంది. 
అప్పట్లో విజయవాడలో ‘అలంకార్‌ ఎ.సి’, ‘శేష్‌మహల్‌ ఎ.సి’ థియేటర్లు రెంటిలో రిలీజైంది. 

తెగిన టికెట్ల సంఖ్యతో సంబంధం లేకుండా హాలులో ఉన్న సీట్లు అన్నింటిపైనా ప్రతి షోకూ ప్రభుత్వానికి వినోదపు పన్ను కట్టాల్సిన ‘శ్లాబ్‌ సిస్టమ్‌’ నడుస్తున్న రోజులవి. అయినా సరే, ఒక్క ‘అలంకార్‌’లోనే 43 రోజులు నడిచింది. ఒక రీ–రిలీజ్‌ సినిమా అలా బెజవాడలో ఒక ఎ.సి. థియేటర్‌లో అన్ని రోజులు ప్రదర్శితం కావడం అప్పటికీ, ఇప్పటికీ హయ్యస్ట్‌ రికార్డ్‌. ఆ తర్వాత షిఫ్టులతో బెజవాడలో మొత్తం 11 వారాలు ఆడింది. ఇక, ఆ శ్లాబ్‌ సిస్టమ్‌లోనే గుంటూరులో ఈ రీ–రిలీజ్‌ సినిమా ఏకంగా 33 రోజులు హౌస్‌ఫుల్‌! అంతేకాదు... అప్పటి సంక్రాంతి కొత్త చిత్రాలన్నింటినీ మించి ఆ ఊళ్ళో 69 రోజులు ఆడి, కాసులు కురిపించింది.  

‘‘1997లో మళ్ళీ కొత్త పబ్లిసిటీ, పోస్టర్‌ డిజైన్లతో సినిమాను భారీగా రిలీజ్‌ చేస్తే, అన్నిచోట్లా బాగా ఆడి, ఏరియాలవారీగా కొనుక్కున్న అందరికీ లాభాలు పండించింది’’ అని అప్పట్లో ఈ చిత్రం హక్కులు కొని, పంపిణీ చేసిన సినీ ప్రముఖుడు కొమ్మినేని వెంకటేశ్వరరావు చె΄్పారు. ఆ 1997లోనే ‘పాండవీయం’ హైదరాబాద్‌లో షిఫ్టింగులతో 100 రోజులు ఆడింది. అలా... వచ్చిన ప్రతిసారీ కొత్త సినిమాలకు దీటుగా దీర్ఘకాలం నడిచింది. ఇలా నాలుగుసార్లు 50 నుంచి 100 రోజులు ఆడిన సినిమా మరొకటి లేదు.  

పదే పదే పెట్టుబడిని మించి లాభం
ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కళాఖండం అప్పటి నుంచి ఇప్పటి దాకా దాదాపుగా రీ–రిలీజైన ప్రతిసారీ కాసుల వర్షం కురిపిస్తూనే వచ్చింది. సినిమా రూపకల్పనకైన తొలి నిర్మాణవ్యయానికే కాదు... రీ–రిలీజుకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి కూడా అనేక రెట్లు వసూలు చేసి, ఆశ్చర్యపరిచింది. చివరకు శాటిలైట్‌ టీవీ ఛానళ్ళు, ఇటీవల ఓటీటీలు వచ్చాక కూడా ‘పాండవీయం’ సినిమాకు క్రేజు తగ్గలేదు. మొదట్లో రెండు తడవలు ‘ఈ’ టీవీ వారికి, ఆ తరువాత మరో మూడుసార్లుగా ‘జెమినీ’ వారికీ ప్రసార హక్కులను పరిమిత కాలవ్యవధికి అమ్మారు. ఒక్క 2011లోనే శాటిలైట్‌ హక్కులు రూ. 25 లక్షలకు అమ్ముడవడం గమనార్హం. అనేక చిత్రాల హక్కులు శాశ్వత ్రపాతిపదికన అమ్ముడైపోతుంటే... అరవై ఏళ్ళ నాటి ఈ క్లాసిక్‌ చిత్ర శాటిలైట్‌ రైట్స్‌ ఇలా ఇప్పటికి అయిదుసార్లు పదే పదే పెద్ద మొత్తానికి అమ్ముడవడం అపూర్వం. అంటే, ఈ చిత్రరాజం తన తొలినాళ్ళ బడ్జెట్‌తో పోలిస్తే, ఇప్పటికి ఎన్ని వందలరెట్లు వ్యాపారం చేసినట్టు!  

చెప్పింది బంగారు నంది! ఇచ్చింది వెండి నంది!!
ప్రభుత్వమిచ్చే ప్రతిష్ఠాత్మక నంది అవార్డులు అరవై ఏళ్ళ క్రితం కూడా వివాదాస్పదమయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. నంది అవార్డులు ఆరంభించిన రెండో ఏడాదే ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ విషయంలో అదే జరిగింది. ఆ చిత్రం సెన్సార్‌ 1965 డిసెంబర్‌లోనే అయిపోయింది. అందుకే, 1965కిచ్చే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నంది అవార్డుల బరిలోనే అది పోటీకి నిలిచింది. ఆ ఏడాది అవార్డుల్లో మొదట ఉత్తమ చిత్రంగా ఎన్టీఆర్‌ ‘పాండవీయం’కి బంగారు నందిని ఇస్తున్నట్టు ప్రకటించారు. తీరా ప్రకటన తరువాత కూడా ప్రైజు మార్చి, వెండి నందితో సరిపెట్టారు. అదేమంటే... ‘పాండవీయం’ ΄ûరాణికం కదా, కాబట్టి అది సొంతంగా రాసిన కథ కాదు కదా అని అభ్యంతరం చె΄్పారు. అలా ఏయన్నార్‌ ‘అంతస్థులు’కి ఆ ఏడాది బంగారు నంది దక్కింది. తీరా బహుమతి ప్రదానం కూడా అయిపోయాక ‘అంతస్థులు’ పైనా వివాదం వచ్చింది. ‘నిను వీడని నీడను నేనే...’ పాట ఉన్న ఆ చిత్ర కథను ప్రధానంగా నడిపేది భౌతికం కాని దయ్యం పాత్ర అనీ, దానికి ఎలా బంగారు నంది ఇచ్చారనీ రచ్చ రేగింది.

నవల మిగిలింది! నెగిటివ్‌ పోయింది!
ఫస్ట్‌ రిలీజ్‌ నాటికే ‘పాండవీయం’ వెండితెర నవలగా కూడా వచ్చింది. సముద్రాల జూనియర్‌ దానికి కథనం కూర్చడం విశేషం. అయితే, తెలుగువారి దురదృష్టం ఏమిటంటే, ఈ అపురూప సినీ కళాఖండం ఒరిజినల్‌ నెగిటివ్‌ 1990ల రీ–రిలీజ్‌ నాటికే కొంత దెబ్బతింది. పదే పదే రీ–రిలీజుల కోసం నెగిటివ్‌ నుంచి ప్రింట్లు వేస్తున్నందున, అసలు ‘ఒరిజినల్‌ నెగిటివ్‌’ బాగున్న సందర్భంలోనే ఎన్టీఆర్‌ ముందు జాగ్రత్తతో ‘డూప్‌ నెగిటివ్‌’ కూడా చేయించి పెట్టారు. కానీ కళాతపస్విగా ఎన్టీఆర్‌ ్రపాణం పెట్టి తీసిన ఈ చిత్రం తాలూకు ఆ నెగిటివ్‌లు రెండూ ఇప్పుడు ఎక్కడున్నాయో ఆచూకీ లేదు. ఈ వెండితెర క్లాసిక్‌ డిజిటైజేషన్‌ ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేటుపరంగా కానీ ఎక్కడా జరిగినట్టులేదు. టీవీల్లో ప్రసారానికై సిద్ధం చేసిన అరకొర డిజిటల్‌ మాస్టర్లు, కోతలు పోనూ యూ ట్యూబ్‌లో మిగిలిన సినిమానే ఇప్పుడు మిగిలిన మహాప్రసాదం. ఘనమైన మన చరిత్రపై మనకున్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. క్షమార్హం కాని కళా, సాంస్కృతిక నేరం.

ఏకకాలంలో... రెండు భాషల్లో...
ఎన్టీఆర్‌ ఏకకాలంలో తెలుగు, తమిళాల్లో ద్విభాషా చిత్రంగా దీన్ని తెరపైకి ఎక్కించారు. తమిళ వెర్షన్‌కు ‘రాజసూయం’ అని టైటిల్‌ పెట్టారు. తమిళంలోనూ శ్రీకృష్ణ పాత్రను ఎన్టీఆర్‌ స్వయంగా ధరించారు. సుయోధన పాత్రకు మాత్రం తమిళంలో అప్పటికే రంగస్థలంపై వివిధ ΄ûరాణిక పాత్రలను పోషిస్తూ, సుప్రసిద్ధుడైన రంగస్థల – సినీ నటుడు ఆర్‌.ఎస్‌. మనోహర్‌ను ఎంచుకున్నారు. అలాగే, నారదుడిగా టి.ఆర్‌. మహాలింగం, మరికొన్ని పాత్రలకు రామదాస్, ఓ.ఏ.కె. దేవర్‌ లాంటి పేరున్న అక్కడి నటులను తీసుకున్నారు. ఎస్‌. వరలక్ష్మి (కుంతి పాత్ర), తెలుగు తెరపై తొలిసారిగా చిరకాలం గుర్తుండిపోయే పాత్రలు చేసిన కె.ఆర్‌. విజయ (రుక్మిణి పాత్ర), కన్నడ నటుడు ఉదయ్‌కుమార్‌ (భీమసేనుడి పాత్ర) లాంటి వారు తమిళంలోనూ అవే పాత్రలతో అలరించారు.

ఆయనే హీరో... ఆయనే విలన్‌...
ఇటు హీరో, అటు విలన్‌... రెండు పాత్రలూ ఒకే సినిమాలో ఒకే నటుడు పోషించి, మెప్పించడం సాంఘిక సినిమాల్లో సైతం పెను సవాలు. అలాంటిది ఇక, ΄రాణికాల్లో అయితే వేరే చెప్పేదేముంది? అలాంటి క్లిష్టమైన సవాలును స్వయంగా భుజానికెత్తుకొని ఒక రకంగా ఒంటి చేతితో ఎన్టీఆర్‌ చేసిన మ్యాజిక్‌ ‘పాండవీయం’. కథానుసారం పాండవుల్ని నామరూపాలు లేకుండా చేయాలనుకొనే ప్రతినాయక పాత్ర సుయోధనుడు. వారిని ఎలాగైనా కాపాడే పనిలో ఉండే నాయక పాత్ర శ్రీకృష్ణుడు. అలా ఈ కథంతా హీరో వర్సెస్‌ విలన్‌ వ్యవహారం. ΄రాణికాల్లో ఈ రెండు పాత్రలూ పోషించిన నటుడు ఎవరూ లేరు. అలాంటిది... ఈ రెండు పాత్రలూ ఒకే సినిమాలో వేసి, ఒప్పించి, జనాన్ని మెప్పించడం, అదే సమయంలో నిరుపమాన నిర్దేశకత్వ ప్రతిభ చూపడం ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది. అది ఒక్క ‘పాండవీయం’కే జరిగింది.

మరపురాని శకుని పాత్రపోషణ
‘పాండవీయం’లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శకుని పాత్ర. ఆ పాత్రకు దర్శకుడిగా ఎన్టీఆర్‌ ఇచ్చిన ్రపాధాన్యం అంతా ఇంతా కాదు. గాంధార రాజ్య వారసుడిగా కౌరవులపై శకునికి పైకి కనిపించని పగ, మాయోపాయానికి ఉన్న గాథను తెరపైకి తొలిసారిగా తీసుకువచ్చారు. అలా శకుని పాత్ర, ఆ పాత్ర ప్రవర్తనలకు కథాపరంగా చేసిన వ్యాఖ్యానం, తెరపై కథనంలో చూపిన తీరు అపూర్వం. దానికి తగ్గట్టు రంగస్థల దిగ్గజమైన ధూళిపాళ ఆ పాత్రపోషణలో ప్రదర్శించిన ప్రతిభ మరో ఎత్తు. అందుకే, ఇవాళ్టికీ ధూళిపాళ, ‘పాండవీయం’లో ఆయన పోషించిన ఆ శకుని పాత్ర ప్రేక్షకుల మనసులో చెరగకుండా నిలిచిపోయాయి. అలాగే, మయసభా ఘట్టంలో సుయోధనుడిగా ఎన్టీఆర్‌ అనుపమానమైన నటన, సంస్కృత సమాసభూయిష్ఠమైన ఆ సుదీర్ఘ సంభాషణల్ని పలుకుతూ ఆయన అభినయించిన తీరు, సముచితమైన షాట్‌ డివిజన్, కెమెరా వర్క్, ఎడిటింగ్‌లతో వాటిని తెరపై పండించిన దర్శకత్వ సామర్థ్యం... ఇలా అన్నీ మరపురానివే!

ప్రజల మనసుల్లో సుయోధనుడు
నెగిటివ్‌ ఛాయలున్న పురాణపాత్రను తీసుకొని, అలాంటి పాత్రకు సైతం ఒక హీరో వర్షిప్‌ వచ్చేలా, అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా తీర్చిదిద్దడం అసాధారణ విన్యాసం. ఎవరెన్ని విమర్శలు చేసినా లెక్కచేయకుండా అతి కష్టమైన ఆ ఫీట్‌ను వెండితెరపై ఒకటికి రెండుసార్లు అనాయాసంగా చేశారు ఎన్టీఆర్‌. ‘సీతారామ కల్యాణం’లో రావణ పాత్ర, ‘పాండవీయం’ – ‘కర్ణ’ల్లో సుయోధన పాత్రలు అందుకు మచ్చుతునక. భారతంలోని దుర్యోధన పాత్రను... ఆభిజాత్యం, ఔద్ధత్యం, మైత్రీభావం నిండిన సుయోధనుడిగా చూపి, ఆ పాత్రతో ప్రేమలో పడేలా చేయడం ఎన్టీఆర్‌కే చెల్లింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే – ఆ పాత్ర డైలాగులు నేటి సోషల్‌ మీడియా యుగంలోనూ సూపర్‌హిట్టే! ‘జెన్‌ జీ’ తరం ఫోన్లలోనూ పాపులర్‌ రింగ్‌టోన్లే!! అలాగే, తెలుగునాట అనేక చోట్ల ఎన్టీఆర్‌ వేసిన శ్రీకృష్ణాది దైవపాత్రలే కాదు... చివరకు సుయోధన పాత్ర వీధుల్లో విగ్రహాల రూపంలో నిలిచింది. ఒక ప్రతినాయక పాత్రను అంతలా ప్రేమాస్పదం చేయడం ఆ పాత్రకు ్రపాణం పోసిన నట, దర్శకుడిగా ఎన్టీఆర్‌ గొప్పదనం. 

– రెంటాల జయదేవ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement