
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అనారోగ్య కారణాలతో ప్రముఖ నటుడు, కమెడియన్ బ్యాంక్ జనార్ధన్ కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం జనార్ధన్ వయస్సు 75 ఏళ్లు కాగా.. శాండల్వుడ్లో బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల శాండల్వుడ్ సినీతారలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. కన్నడ సినీ ఇండస్ట్రీలో టీవీ సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 'పాపా పాండు', 'మాంగల్య జోకలి', 'రోబో ఫ్యామిలీ' వంటి ప్రముఖ సీరియల్స్లో ఆయన కనిపించారు. కేఎల్ స్వామి దర్శకత్వం వహించిన 'పితామహ' (1985) సినిమాతో ఎంట్రీ ఇచ్చారు . తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్తో అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన ష్(1993), 'తర్లే నాన్ మగా' (1992), 'గణేశ సుబ్రమణ్య' (1992), కౌరవ (1998) చిత్రాల్లో నటించారు.
కాగా..1948లో బెంగళూరులోని సుల్తాన్హళ్లి (ప్రస్తుతం సుల్తాన్పాళ్య)లో జన్మించిన జనార్దన్ దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. టెలివిజన్, సినిమాలతో పాటు రంగస్థల నాటకాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో 2023లో ఓ సారి గుండెపోటుకు గురైన ఆయన ఆ తర్వాత కోలుకున్నాడు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఈ రోజు సాయంత్రం 5:30 గంటల వరకు సుల్తాన్పాళ్యలోని ఆయన నివాసంలో ఉంచనున్నారు.