ఈ సంక్రాంతి సీజన్లో చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాలు బాక్సాఫీస్ విన్నర్స్గా నిలిచాయి. థియేటర్ రన్ ముగిసిన ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వెండితెరపై వాటిని మిస్ అయిన వారు, మళ్ళీ చూడటానికి ప్లాన్ చేసుకున్న వారికి ఇప్పుడు శుభవార్త వచ్చింది. రెండు సినిమాలు వేర్వేరు ప్లాట్ఫామ్లలో ఈ రాత్రి ఓటీటీలో ప్రీమియర్ కానున్నాయి.
అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫిబ్రవరి 11న జీ5(ZEE5)లో విడుదల కానుంది. అంటే నేడు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీ5 పేర్కొంది. ఇందులో మరో హీరో వెంకటేశ్ సందడి చేయగా నయనతార తన నటనతో మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 375 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరీ ఓటీటీలో కూడా ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగ ఒక రాజు కూడా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. మారి దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ రాజకీయ హాస్య చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా నేడు అర్ధరాత్రి నెట్ఫ్లిక్స్(Netflix)లో OTTలోకి అడుగుపెడుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది.. రెండు విజయవంతమైన సినిమాలు ఒకే రాత్రి ప్రీమియర్ అవుతుండటంతో, ఇది OTT ప్రేక్షకులకు డబుల్ ట్రీట్గా మారుతుంది. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో చూడతగిన చిత్రాలుగా ఉండనున్నాయి.


