చెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ ‘కొచ్చడైయాన్’ సినిమా నిర్మాతకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి రూ.2.5 కోట్లు చెల్లిస్తారా.. లేదా జైలుకు వెళ్తారా అనేది తేల్చుకోవాలని చిత్ర నిర్మాతకు కోర్టు హుకూం జారీ చేసింది. రజనీకాంత్ హీరోగా 3డీ మోషన్ క్యాప్చర్ మూవీగా కొచ్చడైయాన్ ( Kochadaiiyaan) 2014లో విడుదలైంది. ఈ మూవీకి ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత జె. మురళి మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్ల ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది.

చివరి దశలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసేందుకు బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆయన రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో నిర్మాత మురళి మనోహర్ విఫలం కావడంతో చట్టపరమైన వివాదానికి మూలంగా మారింది. అయితే, కొంత కాలం తర్వాత తిరిగి చెల్లింపులో భాగంగా చిత్ర నిర్మాత కొన్ని చెక్కులు ఇచ్చాడు. అందులో ఒకటి బౌన్స్ అయింది. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశాడు. అనేక సంవత్సరాల పాటు విచారణ తర్వాత, ట్రయల్ కోర్టు నిర్మాతను దోషిగా నిర్ధారించి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన గడవులోపు చెల్లించకపోతే జైలు శిక్షను అమలు చేయవచ్చని కోర్టు పేర్కొంది.


