దివంగత లెజెండరీ నటి మధుబాల జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు బాలీవుడ్లో ఎప్పట్నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ మధుబాల బయోపిక్ ఇంకా సెట్స్కు వెళ్లలేదు. వెండితెరపై మధుబాలగా నటించే హీరోయిన్ అంటూ కియారా అద్వానీ, సాయిపల్లవి వంటి తారల పేర్లు వినిపించాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలైజ్ కాలేదు. తాజాగా యువ నటి సారా అర్జున్ దాదాపు ఖరారయ్యారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. హిందీ సినిమా ‘డార్లింగ్స్’ ఫేమ్ దర్శకురాలు జస్మీత్ కె. రీన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
సంజయ్లీలా భన్సాలీ నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ లీడ్ రోల్స్లో నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లవ్ అండ్ వార్’ ఫైనల్ షెడ్యూల్తో బిజీగా ఉన్నారు భన్సాలీ. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే జస్మీత్తో కలిసి ‘మధుబాల’ బయోపిక్ పనులను వేగవంతం చేసేలా ప్లాన్ చేస్తున్నారట భన్సాలీ. సెప్టెంబరులో చిత్రీకరణను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్.
ఇక ఈ సినిమాలో వెండితెరపై మధుబాల స్టార్ స్టేటస్తో పాటు ఆమె జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, కొన్ని వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకువచ్చేలా జస్మీత్, భన్సాలీ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నారట. మరి... మధుబాలగా సారా అర్జున్ నటిస్తారా? లేదా వేరే తార తెరపైకి వస్తారా? అనేది వేచి చూడాల్సిందే.


