వాళ్ల కష్టం ఎక్కువ.. చాలా తక్కువ రెమ్యునరేషన్‌ ఇస్తున్నారు: సాయిపల్లవి | Sai Pallavi Comments On Assistant Directors Remuneration, Deets Inside | Sakshi
Sakshi News home page

వాళ్ల కష్టం ఎక్కువ.. కానీ, చాలా తక్కువ రెమ్యునరేషన్‌ ఇస్తున్నారు: సాయిపల్లవి

Nov 11 2024 6:52 AM | Updated on Nov 11 2024 9:06 AM

Sai Pallavi Comments On Assistant Directors Remuneration

ఇటీవల ఎక్కడ చూసినా సాయిపల్లవి పేరే వినిపిస్తోంది. అందుకు కారణం అమరన్‌ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనే.
అందరి హీరోయిన్ల రూటు వేరు సాయి పల్లవి రూటు వేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ మాటను మరోసారి సాయిపల్లవి నిరూపించారు. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న చాలామంది హీరోయిన్లు తమకు తక్కువగా పారితోషికం ఇస్తున్నారని గగ్గోలు పెట్టడం మనం చూశాం. కానీ సాయిపల్లవి మాత్రం అందుకు భిన్నంగా ఒక సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్న అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌కు తక్కువ రెమ్యునరేషన్‌ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. వారి కష్టానికి తగినంత పారితోషం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.

సౌత్‌ ఇండియాలో సాయిపల్లవి పేరు ఎప్పటికీ ప్రత్యేకమే.. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఎలాంటి యాడ్స్‌ చేయనని చెప్పేస్తారు. కథకు అందులోని తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అది ఎంత భారీ చిత్రం అయినా, స్టార్‌ దర్శకుడు, కథానాయకుడు అయినా నో అనేస్తారు. ఇక పోతే స్కిన్‌ షో అనే విషయాన్నే దరిదాపులకు కూడా రానివ్వరు. అసలు మేకప్‌కు ప్రాముఖ్యతను ఇవ్వరు. అందుకే సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇక విజయాల విషయానికి వస్తే ఈమె నటించిన అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి.  

ఇక అమరన్‌ చిత్రంలోని తన నటనకు దర్శకుడు మణిరత్నం వంటి వారే ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలో ఈమె నటుడు నాగచైతన్యతో జతకట్టిన తండేల్‌ చిత్రం  తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా మరో హిందీ చిత్రం ప్రచారం జరుగుతోంది. తెలుగులోనూ మరో కొత్త చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

ఇలా వరుసగా చిత్రాలు చేసుకుంటూ బిజీగా ఉన్న సాయిపల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సహాయ దర్శకుల గురించి మాట్లాడారు. సహాయ దర్శకులకు వారి అర్హతకు తగిన వేతనాలు ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్‌తో పోలిస్తే వేతనాలు చాలా తక్కువ తీసుకుంటున్న దర్శకులు మన చిత్ర పరిశ్రమంలో ఉన్నారని పేర్కొన్నారు. బాలీవుడ్‌లో ఒక చిత్రాన్ని చేసిన సహాయ దర్శకుడు వెంటనే మరో చిత్రానికి పనిచేయడానికి సిద్ధమవుతున్నారని, ఇది చాలా మంచి విషయమని అన్నారు. అయితే. దక్షిణాదిలో పరిస్థితి వేరు అని పేర్కొన్నారు వారి శ్రమకు, అర్హత తగిన వేతనం లభించడం, లభించకపోవడం బాధ కలిగిస్తోందని సాయిపల్లవి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement