దర్శన్‌ మా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపుతా: రేణుకాస్వామి తండ్రి | Renukaswamy Father Comments On Darshan Thogudeepa, See Deets Inside | Sakshi
Sakshi News home page

దర్శన్‌ మా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపుతా: రేణుకాస్వామి తండ్రి

Jul 27 2024 2:44 PM | Updated on Jul 27 2024 3:41 PM

Renukaswamy Father Comments On Darshan

రేణకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్‌ హీరో దర్శన్ A2 గా ఉన్నారు. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో గత 30 రోజులుగా శిక్ష అనుభవిస్తున్నారు. దర్శన్‌కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో ఆహారం కోసం జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.

తాజాగా కన్నడ సీనియర్‌ హీరో వినోద్‌రాజ్‌ పరప్పన జైలులో ఉన్న దర్శన్‌ను కలుసుకున్నారు. ఆయన్ను పరామర్శించిన వారం తర్వాత రేణుకాస్వామి కుటుంబాన్ని కలుసుకున్నారు. అక్కడ వారి పరిస్థితి చూసి ఆయన చలించిపోయారు. రేణుకాస్వామి సతీమణితో పాటు ఆయన తండ్రి ఇప్పటికీ కోలుకోకుండా ఉన్నారని తెలిపాడు. ఇంటికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం వీధినపడుతుందని, ఆ లోటును భగవంతుడు కూడా తీర్చలేడన్నారు. కుటుంబానికి ఆయన రూ. లక్ష సాయం అందించారు.

నటుడు దర్శన్‌ గురించి రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో దర్శన్‌  విడుదల అయ్యాక తన ఇంటికి వస్తే భోజనం పెడతానని, తాము జంగమ సామాజికవర్గం వారమని, ద్వేషం, అసూయ వంటివి ఉండవన్నారు. చట్ట ప్రకారం తమకు న్యాయం కావాలన్నారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మి తన భర్త కోసం పోరాడటంలో తప్పులేదని ఈక్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి ఆమె ఏం మాట్లాడారు అనే సంగతి తమకు అనవసరమని ఆయన అన్నారు. జైలులో ఉన్న దర్శన్‌ ఆరోగ్యం బాగుండాలని త్వరగా విడుదల కావాలని కోరుతూ భార్య విజయలక్ష్మి నవ చండికా హోమం జరిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement