
రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. కానీ ఆ రాష్ట్రానికి చెందిన ప్రేక్షకులే ఈమెని ఎప్పటికప్పుడు విమర్శిస్తుంటారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. గతంలో పలుమార్లు ఈమే మాట్లాడిన మాటలే దీనికి కారణం అని చెప్పొచ్చు. మరి తెలిసి చేసిందో తెలియక చేసిందో గానీ ఇప్పుడు మరోసారి కన్నడని కెలికింది. అసలే కమల్ హాసన్ వల్ల కోపంతో ఉన్నారు. ఇప్పుడు రష్మిక లేటెస్ట్ పోస్ట్ చూసి షాకవుతున్నారు.
రష్మిక నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర'. శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా జూన్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. నిన్ననే ముంబైలో ఓ ఈవెంట్ జరగ్గా.. అంతకు ముందు దక్షిణాదిలోనూ జరిగాయి. ఈ క్రమంలోనే రష్మిక తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతో పాటు చెన్నైతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంది. ఇప్పుడదే కన్నడిగుల ఆగ్రహం తెప్పిస్తోంది.
(ఇదీ చదవండి: 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో ఫేమస్.. ఎవరీ డస్కీ బ్యూటీ?)
రష్మిక పోస్ట్లో ఏముందంటే.. 'చెన్నైలోనే తన బాల్యం గడిచింది. అందుకే చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది' అని రాసుకొచ్చింది. అంటే ఓ రకంగా తనది చెన్నై అన్నట్లు చెబుతోంది. ఇది ఇప్పుడు కన్నడిగులకు అసంతృప్తి తెప్పిస్తోంది. ఎందుకంటే రష్మిక పుట్టి పెరిగింది, స్కూల్ చదువుకున్నదంతా కర్ణాటకలోనే. కానీ చెన్నైలో బాల్యం గడపడం ఏంటి అని కన్నడ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
గతంలో 'కాంతార' సినిమాని తాను ఇంకా చూడలేదని చెప్పి ట్రోలింగ్కి గురైన రష్మిక.. మరో సందర్భంలో హైదరాబాద్ తనకు ఇల్లు లాంటిదని చెప్పి కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు మరి ఉద్దేశపూర్వకంగా చేసిందో లేదో తెలీదు గానీ ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)