Rashmika Mandanna: ఈ టైమ్​లో ఇలాంటి సినిమా చేయడం సూపర్బ్​: రష్మిక మందన్నా

Rashmika Mandanna About Aadavallu Meeku Joharlu Movie - Sakshi

హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ చిత్రంలో హీరోయిన్​గా రష్మిక మందన్నా నటించింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించారు. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపింది రష్మిక మందన్నా. 

అప్పుడు సంతోషపడ్డాను..
ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకతనే మొదట కలిగింది. ఆ పాత్రలకు ఎవరెవరిని అనుకుంటున్నారో చెప్పాక సంతోషపడ్డాను. ఈ సినిమా ప్రధానంగా ఇంటర్వెల్ సీన్ ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా ఎలాగైనా చేయాలని అనిపించింది.

డైలాగ్​ ప్రధానంగా సాగే పాత్రలే..
ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య.  ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు. సినిమా నిండా ఆడవాళ్లమే ఉంటాం కాబట్టి సెట్ లో మగవాళ్లంతా మమ్మల్ని చూసి ..వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో అంటూ ఇబ్బంది పడేవారు. ఈ సినిమాలో  మా క్యారెక్టర్స్ అన్నీ డైలాగ్ ప్రధానంగా సాగుతుంటాయి. అందరూ మాట్లాడుతుంటారు. అవన్నీ మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నట్లు సహజంగా ఉంటాయి.

చాలా సరదాగా ఉండేది..
దర్శకుడు కిషోర్ తిరుమలతో పనిచేయడం చాలా సరదాగా ఉండేది. ఆయనకు దైవభక్తి ఎక్కువ. మాల వేసుకునేవారు. ఏం కోరుకున్నారు సార్ అని అడిగితే.. ఇంతమంది మహిళలతో సినిమా చేస్తున్నాను కదా అన్నీ సవ్యంగా జరగాలని కోరుకున్నా అని నవ్వుతూ చెప్పేవారు. అలా ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ నవ్వుకునేవాళ్లం. సినిమా విషయంలో చాలా స్ఫష్టత ఉన్న దర్శకుడాయన. కిషోర్ తిరుమల మహిళలకు ఎంత విలువ ఇస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.  కమర్షియల్ సినిమాలు, హీరోయిజం ఉన్న సినిమాలు వస్తున్న ఈ టైమ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సినిమా చేయడం సూపర్బ్.  

శర్వా ఇంటి నుంచి ఫుడ్​ తెచ్చేవాడు..
శర్వానంద్ తో కలిసి నటించడం హ్యాపీ. నేను పుష్ప సెట్ లో నుంచి ఆడవాళ్లు..షూట్ కు వచ్చినప్పుడు చాలా రికాక్స్ అయ్యేదాన్ని. అక్కడ అడవుల్లో షూటింగ్ చేసి ఇక్కడికొస్తే పిక్నిక్ లా అనిపించేది. ఇంటి నుంచి శర్వా ఫుడ్ తెచ్చి పెట్టేవాడు. ఒక ఫ్యామిలీలా అంతా కలిసి ట్రావెల్ చేశాం. శర్వాను మిగతా ఆడవాళ్లు ఈ సినిమాలో ఇబ్బంది పెడుతుంటారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను. అంతమంది మహిళల మధ్య ఆయన ఎలా వ్యవహరించారు అనేది సినిమాలో చూడాలి. చాలా ఫన్ గా ఉంటుంది.

అది మర్చిపోలేని అనుభవం..
ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. వాళ్లు అప్పటిదాకా మనతో నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు. షాట్ రెడీ అనగానే ఆశ్చర్యపోయేలా మారిపోతారు. ఆ క్యారెక్టర్ లోకి వెళ్తారు. సెట్ లో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలన్నీ వాళ్లను చూసి నేర్చుకున్నా. నేను ఉన్నందుకే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది అని ఉర్వశి గారు అనడం నామీదున్న ప్రేమతోనే.

మళ్లీ చేయాలని ఉంది
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ కు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మళ్లీ ఈ సంస్థలో వర్క్ చేయాలని ఉంది.   దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్. దేవి టాలెంట్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ఆల్బమ్ లోని అన్ని పాటలు హిట్ చేశాడు. ఆర్ఆర్ కూడా సినిమాను బాగా ఎలివేట్ చేస్తుంది.

వాళ్ల నటనతో ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు
ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కీర్తి, సాయిపల్లవి ఉండటం ఎంతో హ్యాపీ అనిపించింది. వాళ్లను చూస్తుంటే మహిళా శక్తిని చూసినట్లు ఉంది. కీర్తి, పల్లవి వాళ్ల వాళ్ల నటనతో ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. నాకు వాళ్లను చూస్తే ఆనందంగా ఉంటుంది. నా తదుపరి సినిమాల వివరాలు త్వరలో వెల్లడిస్తా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top