పెద్ది మూవీ సక్సెస్తో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ మీట్లో పాల్గొన్న రామ్ చరణ్ తాము పడ్డ కష్టాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా సమష్టిగా కృషి చేశామని తెలిపారు. నిజాయతీగా, మనస్ఫూర్తిగా పని చేస్తే ఏ సినిమా అయినా హిట్ కావాల్సిందేనని అన్నారు. ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ..' నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందడం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి చేశా. ఈ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నా. చాలా రోజుల తర్వాత నేను థియేటర్లలో సినిమా చూశా. నేను ఊహించని సీన్స్కు కూడా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం చాలా ఆనందం కలిగించింది. ఇంత మంచి హిట్ అందించిన బుచ్చిబాబుకు, పెద్ది టీమ్కు థాంక్స్. నా లైబ్రరీలో నంబర్వన్గా పెద్ది నిలుస్తుంది. తొలిసారి ఈ కథ విన్నప్పుడే బుచ్చిబాబును హగ్ చేసుకున్నా. నిజాయతీగా పని చేస్తే ఏదైనా హిట్ కావాల్సిందే. పెద్ది సినిమాలో జగపతి బాబుని చూసినప్పుడు.. ఒక ఆర్టిస్ట్గా నా కళ్లలో నీళ్లు తిరిగాయి' అని అన్నారు.
కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో పెద్ది మూవీని తెరకెక్కించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. జగపతిబాబు, శివరాజ్కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం మరింత క్రేజ్ను తీసుకొచ్చింది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


