Rajinikanth-Mani Ratnam: 31 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టబోతోన్న రజనీ-మణిరత్నం
సూపర్స్టార్ రజనీకాంత్ ‘దళపతి’ చిత్రం కాంబినేషన్ రిపీట్ కాబోతుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఒకే ఒక్క చిత్రం దళపతి. ఇందులో మరో కథానాయకుడిగా మలయాళం సపర్స్టార్ మమ్ముట్టి నటించారు. నటుడు అరవిందస్వామి ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. నటి శోభన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1991 నవంబర్ 5న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ఇళయరాజా అందించిన పాటలన్నీ సూపర్హిట్ అయ్యాయి.
చదవండి: స్టాకింగ్ అంటూ ఊర్వశిపై రిషబ్ ఫ్యాన్స్ ఫైర్, ఘాటుగా స్పందించిన నటి
‘రాకవ్మ కయ్యి తట్టు’ అనే పాట ఇప్పటికీ సంగీత ప్రియుల చెవుల్లో మారుమోగుతూనే ఉంది. కాగా ఆ తరువాత మణిరత్నం, రజనీకాంత్ కాంబినేషన్లో ఇప్పటి వరకు చిత్రం రాలేదు. మణిరత్నం తాజాగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం విడుదలై విజయవంతమైంది. ఇందులో ఏదైనా పాత్రలో నటించాలని రజనీకాంత్ భావించారట. నటుడు శరత్కుమార్ పోషించిన పళయ పళువేట్టయార్ పాత్రలో నటిస్తానని మణిరత్నంను రజనీకాంత్ అడిగారట. అయితే అందుకు మణిరత్నం అంగీకరించలేదని స్వయంగా రజనీ ఈ చిత్రం ఆడియో వేడుకలో చెప్పారు.
చదవండి: కాస్టింగ్ కౌచ్పై స్పందించిన బిగ్బాస్ దివి..
కాగా దాదాపు 31 ఏళ్ల తరువాత వీరి సంచలన కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. మణిరత్నం చెప్పిన స్టోరీ లైన్ రజనీకాంత్కు నచ్చినట్లు తెలుస్తోంది. అయితే మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ పార్టు–2 చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక రజనీకాంత్ జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత డాన్ చిత్రం ఫేమ్ శిబిచక్రవర్తి దర్శకత్వంలో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటిస్తారా? లేక ముందుగానే ఆయనతో చిత్రం చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే రజనీకాంత్, మణిరత్నం కాంబినేషన్ చిత్రం గురిం అధికారిక ప్రకటన మాత్రం ఇంకా విడుదల కాలేదు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు