నాంది క్రేజ్‌ని ‘నేను స్టూడెంట్‌’ నిలబెడుతుంది: సతీష్ వర్మ | Producer Satish Varma at Nenu Student Sir press meet | Sakshi
Sakshi News home page

నాంది క్రేజ్‌ని ‘నేను స్టూడెంట్‌’ నిలబెడుతుంది: సతీష్ వర్మ

May 30 2023 4:06 AM | Updated on May 30 2023 10:21 AM

Producer Satish Varma at Nenu Student Sir press meet - Sakshi

‘‘బాహుబలి, హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం’ లాంటి కొన్ని సినిమాలు తప్పితే చాలావరకు ఏ సినిమానీ నేను రెండోసారి చూడలేదు. కానీ ‘నేను స్టూడెంట్‌ సర్‌’ చిత్రాన్ని నాలుగు సార్లు చూశాను.. ఎక్కడా బోర్‌ కొట్టదు. కోవిడ్‌ కారణంగా 40 ఏళ్లకు పైబడిన వారు ‘నాంది’ సినిమాని ఎక్కువగా థియేటర్‌కి వచ్చి చూడలేదు. కానీ ‘నేను స్టూడెంట్‌ సర్‌’ చిత్రం అన్ని వయసుల వారు థియేటర్‌కి వచ్చి చూసేలా ఉంటుంది’’ అని నిర్మాత ‘నాంది’ సతీష్‌ వర్మ అన్నారు.

బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని జంటగా రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’.సతీష్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సతీష్‌ వర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేను స్టూడెంట్‌ సర్‌’లో యూనివర్సిటీలో స్టూడెంట్‌ లైఫ్‌ని చూపించాం. గణేష్‌ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. మంచి థ్రిల్లర్‌ జోనర్‌లో కథ సాగుతుంది.

‘నాంది’కి వచ్చిన క్రేజ్‌ని ఈ సినిమా నిలబెడుతుందని భావిస్తున్నాను. కృష్ణ చైతన్యగారి కథని రాకేష్‌ ఉప్పలపాటి చక్కగా తీశారు. నటి భాగ్యశ్రీ గారి అమ్మాయి అవంతికని మా సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం చేయడం హ్యాపీ. మా తర్వాతి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలోనే ఉంటుంది’’ అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement