ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది: నారా రోహిత్‌ | Nara Rohit interview for bhairavam movie | Sakshi
Sakshi News home page

ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది: నారా రోహిత్‌

May 28 2025 1:06 AM | Updated on May 28 2025 1:06 AM

Nara Rohit interview for bhairavam movie

‘‘ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత సులభం కాదు. కానీ రాధామోహన్‌గారు మమ్మల్ని (సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌) నమ్మి ‘భైరవం’ని రాజీ పడకుండా తీశారు. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. రాధామోహన్‌గారికి ఈ సినిమాతో పెద్ద విజయం, భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అని నారా రోహిత్‌ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’.

విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో జయంతిలాల్‌ గడా సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నిర్మాత బెల్లంకొండ సురేష్‌గారు ఫోన్‌ చేసి, తమిళ చిత్రం ‘గరుడన్‌’ చూడమంటే చూశాను... చాలా నచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌ ‘భైరవం’లో శశికుమార్‌పాత్ర చేయాలని కోరారు. ఆపాత్ర నాకూ బాగా నచ్చడంతో చేశాను.

నా తొలి కమర్షియల్‌ మాస్‌ ఫిలిం ‘భైరవం’. ఇక ఇన్నేళ్ల నా కెరీర్‌లో విజయాలు, అపజయాలు, ఎత్తు పల్లాలు ఉన్నాయి. కథల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది. ఇకపై నా నుంచి రెగ్యులర్‌గా సినిమాలు వస్తాయి. నేను హీరోగా నటించిన ‘సుందరకాండ’ విడుదల జూలైలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

‘పుష్ప’లో షెకావత్‌ (ఫాహద్‌ ఫాజిల్‌ చేసినపాత్ర) క్యారెక్టర్‌కు నన్ను అడిగారు. ఫొటోలు పంపమంటే, మీసాలు పెంచుకుని ఫొటోషూట్‌ చేయించి, పంపాను. కానీ ఇదిపాన్‌ ఇండియా మూవీ కాబట్టి వివిధ భాషల వాళ్లని తీసుకోవాలనే ఆలోచనతో ఫాహద్‌ని తీసుకుని ఉంటారేమో.

Advertisement
 
Advertisement
Advertisement