
‘‘ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక ఏపీ, తెలంగాణలో చాలా సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో మా ఆశలన్నీ ‘హిట్ 3’ సినిమాపైనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మూడు రోజులు ముందుగానే ఆన్లైన్ బుకింగ్స్ చూసి, జనాలు థియేటర్స్కు వస్తున్నారని హ్యాపీ ఫీలయ్యాను. ‘హిట్ 3’ సినిమా విజయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్లయింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’.ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నానీకి ఓవర్సీస్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్గా ‘దసరా’ ఉంది.
ఈ సినిమాను ‘హిట్ 3’ క్రాస్ చేసింది. అలాగే తెలంగాణలో కూడా మేం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘చాలా రిలీజ్లు చూశాను. కానీ ఈ రిలీజ్ వైబ్, సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి. ‘హిట్ 3’ సక్సెస్ తెలుగు సినిమా సక్సెస్’’ అని నాని అన్నారు. ‘‘నానీగారి నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను’’ అని తెలిపారు శైలేష్ కొలను. కెమెరామేన్ షాన్ వర్గీస్ మాట్లాడారు.