ట్విటర్‌ నుంచి నాగబాబు ఔట్‌.. వారిద్దరూ వార్నింగ్‌ ఇచ్చారా..? | Nagababu Leave Twitter Because Allu Arjun Fans | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ నుంచి నాగబాబు ఔట్‌.. వారిద్దరూ వార్నింగ్‌ ఇచ్చారా..?

May 17 2024 1:01 PM | Updated on May 17 2024 6:07 PM

Nagababu Leave Twitter Because Allu Arjun Fans

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కానున్నాడా..? మెగా బ్రదర్స్‌ నాగబాబు, పవన్‌లు ఇద్దరూ బన్నీపై గుర్రుగా ఉన్నారా..? అంటే సోషల్‌ మీడియాలో అవుననే జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, బన్నీ మాత్రం మెగా బంధాలను తెంపుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్లే గుణం అల్లు అర్జున్‌లో ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి బన్నీపై నాగబాబు ఫైర్‌ అవుతున్నారని నెట్టింట వైరల్‌ అయింది. అసలు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడ వచ్చాయి అనేది చూద్దాం.

 

స్నేహితుడి కోసం నిలబడిన అల్లు అర్జున్‌
ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్‌ కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన నంద్యాలకు వెళ్లి తన మద్ధతును ప్రకటించారు. ఆ సమయంలో భారీగా బన్నీ ఫ్యాన్స్‌ శిల్పా రవి ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. 2019లో కూడా అల్లు అర్జున్‌ శిల్పా రవికి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒక ట్వీట్‌ వేశాడు. అది అల్లు అర్జున్‌ గురించే అంటూ నెట్టింట వైరల్‌ అయింది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎటాక్...పారిపోయిన నాగబాబు

నాగబాబు ట్వీట్‌తో రగడ
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను నాగబాబు ట్వీట్‌ బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సమయం నుంచి ఈ రచ్చ మొదలైంది. ఆపై, పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే' అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో తమ అభిమాన హీరో గురించే అంటున్నారని బన్నీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు. 

బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదని వారు తప్పుపట్టారు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేయాల్సిందని నాగబాబును ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. గతంలో జనసేనకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వలేదా అంటూ వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా  నాగబాబు అర్ధిక కష్టాల్లో వున్నపుడు 'నా పేరు సూర్య' సినిమాకు ప్రెజెంటర్‌గా తమరి పేరు వేయించి కొంత సాయం అందేలా బన్నీ చేయలేదా..? అంటూ చెప్పుకొస్తున్నారు. చిరంజీవి కూడా తన స్నేహితుల కోసం ఈ ఎన్నికల్లో మద్ధతుగా నిలబడాలని వీడియోలు చేయలేదా అని నెట్టింట బన్నీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు.

బన్నీ ఫ్యాన్స్‌, చిరంజీవి వల్లే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా..?
వాస్తవానికి బన్నీకి కూడా ఫ్యాన్‌ బేస్‌ భారీగానే ఉంది. తనకంటూ ఒక సపరేట్‌ అభిమానగనాన్ని ఆయన సంపాదించుకున్నారు. వారందరూ సోషల్‌ మీడియా వేదికగా నాగబాబును ఏకిపారేశారు. మరోవైపు చిరంజీవి కూడా నాగబాబు వద్ద బన్నీ విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. ఇంతటితో ఈ వివాదం ఆపాలని ఆయన కోరినట్లు సమాచారం. ఒకవైపు బన్నీ అభిమానుల కామెంట్ల దాడి.. మరోవైపు అన్నయ్య సూచనలు వస్తుండటంతో తన ఎక్స్‌ పేజీని నాగబాబు క్లోజ్‌ చేశారని తెలుస్తోంది.

కష్టాన్నే నమ్ముకున్న అల్లు అర్జున్‌
అల్లు అర్జున్‌ సినిమా ఇండస్ట్రీలోకి అరవింద్‌ కుమారుడిగా.. మెగాస్టార్‌ మేనళ్లుడిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ రెండో సినిమా నుంచే ఆయన తన కష్టాన్నే నమ్ముకున్నారు. ఒకరకంగా తన స్వయం కృషితో బన్నీ ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్‌గా తనను తాను మలుచుకున్నాడు. పుష్ప సినిమా సమయానికి సుకుమార్‌, బన్నీ ఇద్దరూ టాలీవుడ్‌కే పరిమితం. కానీ, అల్లు అర్జున్‌ తన నటనతో పాన్‌ ఇండియాను మెప్పించాడు. అలా బన్నీ వల్ల సుకుమార్‌ పేరు కూడా దేశవ్యాప్తంగా తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత శక్తివంతమైన ఫ్యాన్‌ బేస్‌ కలిగిన హీరోల్లో అల్లు అర్జున్‌ టాప్‌లో ఉంటారు.

Advertisement
 
Advertisement
Advertisement