సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది అందాల తార మీనా. అప్పటికీ, ఇప్పటికీ మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ వెండితెరపై వెలుగులీనుతోంది. సీనియర్ హీరోలతో జోడీ కడుతూనే ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం మీనా మలయాళంలో దృశ్యం 3, తమిళంలో రౌడీ బేబి సినిమాలు చేస్తోంది.
సూపర్ హిట్ సినిమాలు మిస్
తాజాగా మీనా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. మోహన్లాల్-మమ్ముట్టిల 'హరికృష్ణన్స్', కమల్ హాసన్-శివాజీ గణేశన్ల 'తేవర్ మగన్' (క్షత్రియ పుత్రుడు), రజనీకాంత్ 'పడయప్ప' (నరసింహ) సినిమాల్లో నేను నటించాల్సింది. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఈ ఆఫర్స్ తిరస్కరించాల్సి వచ్చింది.
అన్నీ మనమే చేయలేం
ఇవే కాదు, ఇలా చాలా సినిమాలు ఇలాగే పోగొట్టుకున్నాను. అన్ని సినిమాలు మనమే చేయడం అసాధ్యం కదా! అయితే చేజారిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు కాస్త బాధగా అనిపించేది. అరె, మంచి మూవీస్ మిస్ చేసుకున్నానే అని ఫీలయ్యేదాన్ని. వాటిలో యాక్ట్ చేసుంటే నేను కూడా ఆ సక్సెస్లో భాగమయ్యేదాన్ని అనిపించేది.
హీరోకు తల్లిగా..
ఇకపోతే నాకు బ్రో డాడీ సినిమా ఆఫర్ చేసినప్పుడు నా పాత్ర గురించి తెలుసుకోవాలని తహతహలాడాను. తీరా అందులో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు తల్లిగా చేయాలని చెప్పారు. అది విని నేను షాకయ్యాను. అతడు నాకంటే కేవలం ఆరేళ్లు మాత్రమే చిన్నవాడు.. అలాంటిది అతడికి తల్లిగా నటించడం కష్టమని అభ్యంతరం చెప్పాను.
మెచ్చుకోవాల్సిందే!
దాంతో వాళ్లు నాకు నచ్చజెప్పారు. కథ బాగుండేసరికి నేను కూడా చివరకు ఒప్పుకుని చేశాను. సినిమా రిలీజయ్యాక జనం నా పాత్రపై ప్రశంసలు కురిపించారు. మా మధ్య వయసు వ్యత్యాసం తెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంలో పృథ్వీరాజ్ను మెచ్చుకుని తీరాల్సిందే! ఎంతో అంకితభావం, నిబద్ధత ఉన్న వ్యక్తి. అందుకే గొప్ప నటుడితో పాటు మంచి దర్శకుడు కూడా అయ్యాడు అని మీనా చెప్పుకొచ్చింది.


