దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి. ఈ మూవీలో సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వారణాసి చిత్రానికి సంబంధించి అత్యంత క్లిష్టమైన షెడ్యూల్గా భావించిన అంటార్కిటికా షూటింగ్ ఇక జరగదని సమాచారం. ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రాంతమైన అంటార్కిటికాలో కీలకమైన కొన్ని ఎపిసోడ్స్ను చిత్రీకరించాలని దర్శకుడు రాజమౌళి ముందుగా నిర్ణయించారు. టైటిల్ గ్లింప్స్లో దాని గురించిన చిన్న రిఫరెన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రణాళికను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
ఆ ప్రాంతంలో విపరీతమైన చలి, ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులతో పాటు ఈ షెడ్యూల్కి కావాల్సిన భారీ బడ్జెట్ వంటి పరిమితుల కారణంగా ఈ షెడ్యూల్ను రద్దు చేసినట్టు సమాచారం. ముందు అక్కడ షూటింగ్ చేసి కొత్త రికార్డు సృష్టించాలని రాజమౌళి అనుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆలోచనను వదిలేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోనే ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ ఎపిసోడ్ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అనంతరం అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తెరపై అంటార్కిటికా మంచు ఖండాన్ని అద్భుతంగా చూపించే అవకాశం ఉంది.
రాజమౌళి తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం, వారణాసి చిత్రానికి సంబంధించిన మేజర్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలన్నీ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం కథను కలుపుతూ సాగే చిన్న చిన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.


