దివంగత మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లిష్ పుస్తకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటీనటులు జయప్రద, బ్రహ్మానందం, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత నాగ సుశీల, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, ఆమె భర్త గోవిందరావు, వర ప్రసాద్ రెడ్డి, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
జయప్రద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ఈ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టం. చాముండేశ్వరిగారిని చూస్తే నాకు సావిత్రమ్మగారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్లాంటి వారికి ధీటుగా నటించినందుకే సావిత్రమ్మకు మహానటి బిరుదు ఇచ్చారు’’ అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘సావిత్రిగారు చిరస్మరణీయులు. అలాంటి వారికి మరణం ఉండదు’’ అని అన్నారు. విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ– ‘‘సావిత్రి క్లాసిక్స్’ తెలుగు బుక్కి మంచి స్పందన వచ్చింది. ఇంగ్లిష్లో అనువదిస్తే మరింత మందికి రీచ్ అవుతుందని రిలీజ్ చేశాం’’ అని పేర్కొన్నారు. ‘‘నా పట్టుదల, ప్యాషన్ చూసి సావిత్రిగారి అరుదైన ఫొటోలను చాముండేశ్వరిగారు ఇచ్చారు’’ అన్నారు పుస్తక రచయిత సంజయ్ కిషోర్.


