ఆదిపురుష్ భామ కృతి సనన్ ఈ ఏడాది ప్రారంభంలో కాక్టెయిల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో షాహిద్ కపూర్ సరసన మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి సనన్.. సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై మాట్లాడింది. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
సినీ పరిశ్రమలో లింగ వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతుందని కృతి సనన్ అన్నారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉంటే స్టార్డమ్ చాలా ప్రత్యేకమన్నారు. హీరోయిన్ల విషయానికి వస్తే ఎలాంటి గుర్తింపు ఉండదని తెలిపారు. సెట్లో పురుషులకు అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తెరపై రాసే పాత్రల విషయంతో పాటు సెట్లో పురుష, మహిళా నటీనటులను వేర్వేరుగా చూసే విధానంలో కూడా సినీ పరిశ్రమ పురుషులకే అనుకూలంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటివీ ఎక్కువగా చూశానని తెలిపారు. ఒక మహిళా నటి ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు సెట్లో వ్యతిరేకత పెరిగిపోతుందని కృతి సనన్ పంచుకుంది.
కృతి సనన్ మాట్లాడుతూ..' సెట్లో దర్శకుడిని ప్రశ్నలు అడగడం నాకు అలవాటు. నాకు ఆసక్తి ఎక్కువ. ఎప్పటినుంచో అంతే. అలానే నేను ఎదిగాను. నేను నటనలో ఎప్పుడూ శిక్షణ తీసుకోలేదు. ఏమీ తెలియనట్టు ఉండటం కన్నా ప్రశ్నలు అడగడమే మేలు అనుకుంటా. నేను ఏదైనా సలహా ఇస్తే.. నువ్వు దీన్ని అనవసరంగా విశ్లేషిస్తున్నావ్ అంటారు. సెట్స్పై ఉండే మేనేజ్మెంట్కు హీరోల టైమింగ్స్ అంటే ఒక రకమైన భయం, గౌరవం. అందుకే వాళ్లను షాట్ పెట్టాక పిలుస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్లో కూర్చోబెడతారని' ఆమె తెలిపింది.
కృతి సనన్ ఇంకా మాట్లాడుతూ.. 'చాలాసార్లు హీరోయిన్లకు దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం దక్కదు. చెప్పింది చెయ్ అంటూ అవమానిస్తారు. ఇక హీరోయిన్లు ఏ ఏ ప్రమోషన్లలో పాల్గొనాలి.. ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారు. చివరకు మేం వేసుకునే దుస్తులు కూడా వాళ్లే చెబుతారు. అందుకే హీరోయిన్లకు ప్రాధాన్యత లేని పాత్రలు చేయడానికి తాను ఇష్టపడట్లేదని' చెప్పుకొచ్చింది.


