‘‘గుండెలో నుంచి వచ్చే ప్రేమకథకు ఎలాంటి ఆదరణ దక్కుతుందని ‘నిన్ను కోరి’ సినిమాతో తెలిసింది. నాని ఫిల్మోగ్రఫీలో ‘నిన్ను కోరి’ మరచిపోలేని చిత్రంగా నిలిచింది. శివ నిర్వాణ ఈ కథను గుండెతో చెప్పాడు. సతీష్ ‘బ్యాండ్ మేళం’ కథను చెప్పినప్పుడు నాకు అదే అనుభూతి కలిగింది. ఈ మూవీ క్లయిమాక్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది’’ అని రచయిత, నిర్మాత కోన వెంకట్ తెలిపారు.
‘కోర్ట్’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. మార్చి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి సంగీత దర్శకుడు తమన్, దర్శకులు నందినీ రెడ్డి, శివ నిర్వాణ, వేణు ఊడుగుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తమన్ మాట్లాడుతూ– ‘‘కోనగారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ‘దూకుడు’తో నా కెరీర్ ఇంకా కొనసాగుతూనే వెళ్తోంది’’ అని చెప్పారు. ‘‘ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘కోనగారి వల్ల ఎంతో మంది దర్శకులు, రచయితలు ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన నాకు గాడ్ ఫాదర్’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ జీవితం ఉన్న తెలుగు సినిమా ఇది’’ అన్నారు వేణు ఊడుగుల. ‘‘మా సినిమాని అందరూ చూసి, ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని సతీష్ జవ్వాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి చెప్పారు.


