
కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏవో కొన్ని చిత్రాలు మినహా ఏవీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రావడం లేదు. అలా ఓ సినిమాను తన కుటుంబ ఆస్తులు తాకట్టు పెట్టి తీశానంటున్నాడు బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ (Jackky Bhagnani).
సగం కూడా వెనక్కు రాలేదా?
ఇతడు గతేడాది అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్తో కలిసి 'బడే మియా చోటే మియా' సినిమా (Bade Miyan Chote Miyan) చేశాడు. ఇది దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిందని బీటౌన్లో గుసగుసలు వినిపించాయి. కానీ బాక్సాఫీస్ వద్ద కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవలేదు. టోటల్ రన్లో కేవలం రూ.111.49 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ నష్టంతో పూజా ఎంటర్టైన్మెంట్ (Pooja Entertainment) సంస్థ నిర్మాత వాసు భగ్నానీ కుదేలయ్యాడు. ముంబైలోని ఆఫీస్ను అమ్మేసి రూ.250 కోట్ల అప్పు తేర్చేసినట్లు ప్రచారం జరిగింది.
అనుమానమే నిజమైంది
తాజాగా వాసు భగ్నానీ కుమారుడు జాకీ భగ్నానీ సదరు సినిమా నష్టంపై స్పందించాడు. ఆ మూవీ కోసం మేము చాలా డబ్బు ఖర్చు చేశామన్నది వాస్తవం. భారీ బడ్జెట్తో సినిమా తీశాం కానీ కంటెంట్ ఎక్కడో ప్రేక్షకులకు కనెక్ట్ అవదన్న అనుమానం వచ్చింది. మా అనుమానమే నిజమైంది. జనాలు సినిమాను తిప్పికొట్టారు. వారికి ఎందుకు నచ్చలేదన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే భవిష్యత్తులో మరోసారి ఆ తప్పును పునరావృతం చేయకూడదుగా.
ఇప్పుడు చెప్పి ఏం లాభం?
ఆస్తులు తాకట్టు పెట్టి ఈ సినిమా తీశాం. మా బాధ ఎవరికీ అర్థం కాదు. అయినా ఇప్పుడిదంతా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ ఒక్క సంఘటనతో నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. జాకీ భగ్నానీ.. కల్ కిస్నే దేఖా, రంగ్రేజ్, అజబ్ గజబ్ లవ్, వెల్కమ్ టు కరాచీ, మిత్రాన్ వంటి చిత్రాల్లో నటించాడు. కూలీ నెం.1, కట్పుత్లి, మిషన్ రాణిగంజ్, గణ్పథ్, బడే మియా చోటే మియా చిత్రాలు నిర్మించాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
చదవండి: చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు