
‘‘రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డు ఎవరికైనా ప్రత్యేక ఆనందాన్నిస్తుంది’’ అంటూ చిత్రరంగానికి చెందిన పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ‘‘సృజనాత్మక రంగంలో ఉన్న ఏ ఆర్టిస్ట్కైనా, టెక్నీషియన్కి అయినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఎంతో విలువైనది. అవార్డుల సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించడం ప్రోత్సాహకరంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి‡రేవంత్ రెడ్డిగారు, సంబంధిత అధికారులు, ఇతర బృందానికి కృతజ్ఞతలు’’ అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక 2024 సంవత్సరానికిగాను అవార్డు విజేతల స్పందన ఈ విధంగా...
తొలిసారిగా ప్రవేశ పెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో ‘పుష్ప: ది రూల్’ సినిమాకు గాను తొలి ఉత్తమ నటుడిగా నాకు అవార్డు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు క్రెడిట్ అంతా నా దర్శకుడు సుకుమార్గారు, నా నిర్మాతలు (మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్) అండ్ ‘పుష్ప’ టీమ్కే చెందుతుంది. నన్ను ఎల్లప్పుడూ స΄ోర్ట్ చేస్తూ, నాలో స్ఫూర్తి నింపుతున్న నా అభిమానులకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను.
– హీరో అల్లు అర్జున్
–‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో మాకు నాలుగు (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు రావడం గర్వంగా ఉంది. ఇది మాకెంతో ప్రత్యేకం. తెలంగాణ ప్రభుత్వానికి, సీయం రేవంత్రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగార్లకు, జ్యూరీకి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ‘కల్కి 2898ఏడీ’ చిత్రబృందం పేర్కొంది.
–నాగ్ అశ్విన్
– నా జీవితంలో ఎప్పుడూ కష్టపడని రీతిలో ‘పొట్టేల్’ సినిమా కోసం కష్టపడ్డాను. చదువు గురించి చెప్పిన కథను ప్రభుత్వం గుర్తించడం హ్యాపీగా ఉంది. ‘కల్కి 2898 ఏడీ, లక్కీ భాస్కర్’ సినిమాల మధ్యలో మా సినిమాకూ చాన్స్ కల్పించారు. వెయ్యి కోట్ల (కలెక్షన్స్), వంద కోట్ల రూ పాయల సినిమాల మధ్య మా సినిమా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. మా నిజాయితీకి ప్రతిఫలం ఈ రూపంలో వచ్చిందనుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వానికి, మా సినిమాను గుర్తించిన జ్యూరీకి థ్యాంక్స్.
– ‘పొట్టేల్’ దర్శకుడు సాహిత్ మోత్కూరి
– తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ఏడాది నుంచి అవార్డ్స్ను ప్రకటించడం నిజంగా సంతోషంగా ఉంది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ‘దేవర’ సినిమాకు గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్గా విజేతగా నిలిచిన గణేశ్ ఆచార్యగారికి కంగ్రాట్స్.
– హీరో ఎన్టీఆర్
–14 ఏళ్ల తర్వాత మళ్లీ స్టేట్ అవార్డ్స్ రావడం, గద్దర్ అవార్డ్స్ తొలి ఎడిషన్లో నా పేరు ఉండటం, నా దర్శకత్వంలోని ‘లక్కీ భాస్కర్’ సినిమాకు నాలుగు అవార్డులు రావడం హ్యాపీ. ఈ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం కరెక్ట్గా కుదిరింది. ఇందుకు హెల్ప్ చేసిన మా ఎడిటర్ నవీన్ నూలికీ అవార్డు వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణప్పుడే దుల్కర్ సల్మాన్ చాలా మంచి గుర్తింపు వస్తుందన్నారు. నిర్మాత నాగవంశీగారితో ‘లక్కీ భాస్కర్’ నా మూడో సినిమా. ఈ సినిమాకు గద్దర్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఎంటర్టైన్మెంట్ అవార్డులను తిరిగి తీసుకొచ్చిన తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజుగార్లకు, జ్యూరీకీ «థ్యాంక్స్.
– ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి
–మాలాంటి న్యూ టాలెంట్ని ప్రోత్సహించేలా అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా టీమ్ సహకారం లేక΄ోతే ఇలాంటి అవార్డులు కష్టం. ఈ సినిమాని నిర్మించిన మా నిర్మాతలు నిహారిక, ఫణిగార్ల ప్రొడక్షన్ హౌస్లకి ఈ అవార్డు ఓ బూస్ట్లాంటిది. ఈ అవార్డు కొత్తవాళ్లతో సినిమాలు తీయొచ్చనే అభి్ర పాయాన్ని వారికి బలపరుస్తుంది. మా ‘కమిటీ కుర్రోళ్లు’లో నటించిన హీరోలు, మా మ్యూజిక్ డైరెక్టర్, మా డీఓపీగారు సినిమాలతో బిజీ అయ్యారు. ఈ సినిమా విడుదల కాగానే పెద్ద్ద బేనర్స్ నుంచి నాకు ఆఫర్స్ వచ్చాయి.
– ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీ
–హైదరాబాద్లో జరిగిన మారణహోమాన్ని భారతీయుల కళ్ల ముందుకు తీసుకువచ్చేందుకు నిజాయతీగా మేం పెట్టిన కష్టానికి ‘రజాకార్’ సినిమాకిగాను అవార్డ్స్ వచ్చాయనిపిస్తోంది. 1947, 1948 సమయంలో హైదరాబాద్ స్టేట్ కింగ్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలో హిందువులపై రజాకార్లు జరిపిన దురాగతాలను నేటి తరం ప్రేక్షకుల ముందుకు ‘రజాకార్’ సినిమా రూపంలో తీసుకొచ్చే ప్రయత్నంలో మేం సక్సెస్ అయ్యాం. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నందుకు తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ ‘దిల్’ రాజులకు ధన్యవాదాలు.
– బీజేపీ సీనియర్ నేత, ‘రజాకార్’ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి
–మా ‘రజాకార్’కి మూడు అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉంది. మేం ఎంత నిజాయతీగా ఆలోచించి ఈ సినిమా చేశామో జ్యూరీ కూడా అంతే నిజాయతీగా మా సినిమాని ఎంపిక చేయడం సంతోషం. దాదాపు ఇరవయ్యేళ్లుగా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొన్న భీమ్స్ సిసిరోలియోకి మా సినిమా ద్వారా అవార్డు రావడం మాకు, తనకు సంతోషంగా ఉంది. ఇరవయ్యేళ్లుగా ఉన్న మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీనుకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిగారు కూడా చాలా ఆనందంతో ఫోన్ చేసి, మాట్లాడారు.
– ‘రజాకార్’ దర్శకుడు యాటా సత్యనారాయణ
–‘మ్యూజిక్షాప్ మూర్తి’ సినిమాకి నాకు అవార్డు రావడానికి మా టీమ్ సహకారం ఉంది. నిర్మాతలు హర్ష గార పాటి, రంగారావు, సహ–నిర్మాతలు సత్యకుమార్, వంశీ ప్రసాద్, సత్యనారాయణ పాలడుగు మమ్మల్ని నమ్మి, అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. చిన్న సినిమా అని కాకుండా కథ, కథనం, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, దర్శకుడి విజన్... ఇవే జ్యూరీ చూసిందని నేను అనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ అవార్డులను తిరిగి తీసుకొచ్చిన ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్, జ్యూరీకి ధన్యవాదాలు.
– ‘మ్యూజిక్షాప్ మూర్తి’ దర్శకుడు శివ పాలడుగు
–కొత్తవారికి ప్రభుత్వ అవార్డులు ఓ మంచి బూస్ట్లాంటివి. తెలంగాణ ప్రభుత్వానికి «థ్యాంక్స్. ‘క’ రిస్కీ లైన్తో చేసిన సినిమా. స్క్రీన్ప్లేని ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటారు? ఎలా ట్రావెల్ అవుతారు? అనుకునేవాళ్లం. కానీ సబ్జెక్ట్ని బలంగా నమ్మాం. క్లైమాక్స్లో మేం చెప్పిన విషయానికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయితే హిట్ అనుకున్నాం. మేం అనుకున్నట్లే కనెక్ట్ అయ్యారు. ఇక... మేం కొత్త కథలు అనుకోవడానికి చిన్నప్పట్నుంచి మా అమ్మ చెప్పిన కథలు హెల్ప్ అయ్యాయి. మా నాన్నగారి ఎంకరేజ్మెంట్ని మరచి΄ోలేం. అయితే మా సక్సెస్ని చూడకుండానే నాన్నగారు గత ఏడాది దూరం అయ్యారు. ఆ వెలితి ఉంది.
– ‘క’ చిత్రదర్శకులు సుజీత్–సందీప్
–పధ్నాలుగేళ్ల తర్వాత ఇస్తున్న అవార్డ్స్లో నా తొలి సినిమాకు అవార్డ్ రావడం హ్యాపీగా ఉంది. గీతా ఆర్ట్స్ వంటి నిర్మాణ సంస్థ అండగా ఉండటంతో ఈ సినిమా జర్నీ సాఫీగా సాగింది. అయితే మా సినిమా రిలీజ్ టైమ్లో మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. దాంతో మా సినిమా రిజల్ట్ విషయంలో ఆందోళన చెందాను. అయితే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఆయ్’కు అవార్డు వచ్చిందనగానే హీరో నార్నే నితిన్, నిర్మాత బన్నీ వాసుగారు, ఇంకా మా టీమ్ అంతా ఆ షూట్ డేస్ని గుర్తు చేసుకున్నాం.
– ‘ఆయ్’ దర్శకుడు అంజి కె. మణిపుత్ర