డ్రగ్స్‌ కేసు: బ్యాంకు లావాదేవీలపై ఈడీ విచారణ

ED Investigation On Ragini And Sanjana Bank Transactions - Sakshi

సాక్షి, యశవంతపుర: శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో జైలుపాలైన నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారించారు. ఇటీవల సంజనకు చెందిన 11 బ్యాంక్‌ ఖాతాల నుంచి నగదు వివిధ ఖాతాలకు బదిలీ అయిన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అన్ని ఖాతాలలో కలిపి 40 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. సంజన బ్యాంక్‌ ఖాతాకు విదేశాల నుండి నగదు బదిలీ అయిందా అనే కోణంలో సీసీబీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరెవరి ఖాతాల నుంచి ఆమె ఖాతాకు డబ్బులు వచ్చేవి, వెళ్లేవి అని ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. బెంగళూరులో ఐఎంఏ అధినేత మన్సూరుఖాన్‌ సంస్థలో తాను భారీగా డిపాజిట్లు కట్టి మోసపోయినట్లు సంజన ఈడీ ముందు చెప్పినట్లు తెలిసింది. గతేడాది ఐఎంఏ సంస్థ బోర్డు తిప్పేయడంతో వేలాది మంది డిపాజిటర్లు మోసపోయిన సంగతి తెలిసిందే. అధిక వడ్డీలు ఇస్తారని స్నేహితుల మాట విని లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు సంజన తెలిపారు.   

ముగిసిన వీరేన్‌ఖన్నా విచారణ  
డ్రగ్స్‌ కేసులో ముఖ్య నిందితుడు వీరేన్‌ఖన్నా పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. అతని నుంచి సీసీబీ పోలీసులు అనేక విషయాలను సేకరించారు. 2018లో బాణసవాడి పోలీసులు ప్రతీక్‌ శెట్టిని అరెస్ట్‌ చేసిన సమయంలో వీరేన్‌ఖన్నా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. ఖన్నాను 14 రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించి డ్రగ్స్‌ రాకెట్లో కీలక అంశాలను సేకరించారు. తను పార్టీలను మాత్రమే నిర్వహించేవాడిని, డ్రగ్స్‌తో సంబంధం లేదని తెలిపాడు. రాగిణి, సంజన, రవిశంకర్‌ల ముఖం కూడా తాను చూడలేదని చెప్పాడు. విచారణ తరువాత జడ్జి ముందు హాజరుపరిచి పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top