ప్రముఖ బాలీవుడ్ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఇప్పుడు నటుడిగా రాణిస్తున్నారు. ఇటీవలే 'మై వాపస్ ఆవుంగా' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, వేదాంగ్ రైనా, శార్వరి కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే సింగర్ దిల్జీత్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. అంతేకాకుండా తన బాల్యంలోని కష్టాల గురించి మాట్లాడారు. కొన్నిసార్లు తమ కుటుంబం వైద్య చికిత్సకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఎదురైందని తెలిపారు. నా చిన్నప్పుడు మా కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని సింగర్ వెల్లడించారు. పుట్టినరోజు వేడుకలు, పెళ్లిళ్లలో ప్రదర్శనలు ఇచ్చానని పేర్కొన్నారు.
దిల్జీత్ దోసాంజ్ మాట్లాడుతూ..' 2002లో తన తొలి ఆల్బమ్ విడుదల చేశా. ఆ తర్వాత పుట్టినరోజు వేడుకల్లో ప్రదర్శనల కోసం కొందరు తమ కంపెనీని కొందరు సంప్రదించారు. మొదట అలాంటి కార్యక్రమాల్లో పాడటానికి ఆసక్తి లేకపోయినా.. కాంట్రాక్టు వల్ల ఆఫర్లను అంగీకరించా. కేవలం ఆల్బమ్ అమ్మకాలతో ఆర్థికంగా ఎదగలేనని గ్రహించా. ఆ తర్వాత ప్రత్యక్ష ప్రదర్శనల ఇవ్వడమే సరైన మార్గమని నమ్మా. ఆ టైమ్లో నేను ఎవరినీ కాదనలేదు. ఎవరైనా రూ. 5,000, రూ. 10,000, రూ. 15,000 ఇస్తే సరే అన్నా. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని చోట్ల ప్రదర్శనలకు వెళ్లా' అని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల వల్లే పని దొరికిన చోటల్లా ప్రదర్శనలు ఇవ్వడానికి సిద్ధమయ్యానని దిల్జిత్ దోసాంజ్ చెప్పుకొచ్చారు. నేను ఒక పేద కుటుంబం నుండి వచ్చానని.. జబ్బు చేస్తే, డాక్టరు దగ్గరకు వెళ్ళడానికి డబ్బులు ఉండేవి కావని తెలిపారు. అయితే పెళ్లిళ్లలో ప్రదర్శనలు ఇవ్వడం మానేశానని ఆయన వెల్లడించారు. పంజాబీ సంగీత పరిశ్రమలోని కొంతమంది సీనియర్ కళాకారులు నా ప్రదర్శనలను చిన్నచూపు చూశారు. ఆ వ్యాఖ్యలు తన కెరీర్ను ప్రభావితం చేయకుండా.. సొంత కచేరీలను నిర్వహించడంపై దృష్టి పెట్టానని దిల్జీత్ పంచుకున్నారు.


