అందాల తార శ్రీదేవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ది ఎంప్రెస్’ పుస్తకంలో తాను కూడా ఓ అధ్యాయాన్ని రాశానని దర్శకుడు రామ్గోపాల్ వర్మ వెల్లడించారు. శ్రీదేవి నటన అసాధారణమని, ఆమె ప్రతిభను ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. ఆమెతో కలిసి పనిచేసిన అనుభవాలను తాజాగా ఆయన పంచుకున్నారు.
ఏం చెప్పారంటే..
శ్రీదేవి జయంతి సందర్భంగా రచయిత ధీరజ్ యూ.కుమార్ రాసిన ‘ది ఎంప్రెస్’ పుస్తకాన్ని నటి ప్రియాంక చోప్రా ఇటీవల ప్రకటించారు. ఈ పుస్తకంలో తాను ఒక అధ్యాయాన్ని రాశానని వర్మ తెలిపారు. అయితే ‘ది ఎంప్రెస్’ కంటే ‘స్క్రీన్ క్వీన్’ అనే పేరు మరింత బాగుండేదని అభిప్రాయపడ్డారు.
‘శ్రీదేవి మరణించి చాలా కాలమైంది. అయినప్పటికీ ఆమె నటనలోని గొప్పతనాన్ని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నా. ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలోని చార్లీ చాప్లిన్ సన్నివేశం ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనం’ అని వర్మ అన్నారు.
మరోసారి ప్రపంచానికి తెలుస్తుంది..
‘క్షణక్షణం’ చిత్రంలో ఆమెతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. ప్రతి సన్నివేశానికి 15 నుంచి 20 రకాల హావభావాలను ఆమె ప్రదర్శించేదని చెప్పారు. ఆమెతో కలిసి పనిచేయడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని పేర్కొన్నారు.
చెన్నైలో తొలిసారి శ్రీదేవిని కలిసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆమె వచ్చిన ప్రతిసారీ సరికొత్త ఉత్సాహం కలిగేది. ఒక్కసారి అయినా ఆమె మళ్లీ భూమిపైకి రావాలని కోరుకుంటున్నా. ఆమె ఎంత గొప్ప నటో మరోసారి ప్రపంచానికి తెలుస్తుంది’ అని వర్మ చొప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: ప్రముఖ టిక్టాక్స్టార్ను కాల్చి చంపిన దుండగులు


