మెగాస్టార్ చిరంజీవి చేసిన భారీ బడ్జెట్ సినిమా 'విశ్వంభర'. లెక్క ప్రకారం గతేడాదిలోనే థియేటర్లలోకి రావాలి కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. దీని తర్వాత చిరు చేసిన 'మన శంకరవరప్రసాద్' రిలీజై నెలలు గడిచిపోతోంది గానీ దీని అప్డేట్ ఏంటనేది ఇప్పటివరకు తెలియట్లేదు. ఈ ఏడాది ద్వితియార్థంలోనే రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు గానీ అదెప్పుడనేది తెలియట్లేదు. ఇకపోతే ఇప్పుడీ చిత్రం గురించి, ఇందులో గ్రాఫిక్స్ గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ ప్రెస్మీట్లో మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కెమెరామ్యాన్స్ పరిస్థితి ఎలా ఉందో బయటపెట్టారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)
'సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్లేదు. సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్)వాళ్లు ఇప్పుడు చాలా ముఖ్యం. వాళ్లు ఎంత బాగా ఇస్తే కెమెరామ్యాన్ అంత బాగా చేయగలడు. సీజీ ఉన్న సినిమాలు హిట్, ఫ్లాప్ అవ్వడానికి కెమెరామ్యాన్కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్లకేం కావాలో అడిగి.. వాళ్లకు నచ్చినట్లే చేస్తున్నాం. నేను కూడా! నేనో పెద్ద పుడింగి, 'అంజి' చేశాను, 'ఢమరుకం' చేశాను నంది అవార్డ్ వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డ్ వచ్చిందని చెప్పట్లే. మా ఇగోలని పక్కనబెట్టి వాడు అడిగిందే ఇస్తాం. వాడు అడిగిన లైట్ రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోలేకపోతే కెమెరామ్యాన్ సహకరించలేదని వాడు వెళ్లి ఎవరితోనో మాట్లాడి చెడ్డపేరు రావడం ఆ ప్రాజెక్టుకి మంచిది కాదు ఆ కెమెరామ్యాన్కి కూడా మంచిది కాదు. అందుకని వాళ్లకు ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే వాడి ఖర్మ. మా తప్పయితే ఏం లేదు. ప్రేక్షకులు, మీడియా మాట్లాడుకోవట్లేదు గానీ ఏదైనా తేడా జరిగితే కెమెరామ్యాన్ చెడగొట్టేశాడని మాట్లాడుకుంటున్నారు. కానీ కెమెరామ్యాన్కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు సీజీ కంటూ వేరేగా ఓ టెక్నీషియన్ కొత్తగా వచ్చాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు అతడు మా దగ్గరే ఉంటాడు. మాతోనే ట్రావెల్ చేస్తాడు. అతడు చెప్పకుండా ఒక్క ఫ్రేమ్ కూడా మేం తీయం. ఇప్పుడు రూల్ ప్రకారం తీయకూడదు. నేనైతే అతడు లేకుండా కెమెరా ఆన్ చేయట్లేదు'
ఇక 'విశ్వంభర' ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ''అంజి' అయితే తలెత్తుకు పనిచేశాం. 'విశ్వంభర' కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నాను. ఎందుకంటే 'విశ్వంభర' అనేదానిలో చాలా సీజీలు ఉన్నాయి. అక్కడికి పోయి నేను, చోటా కె నాయుడు. నాకు చాలా తెలుసు అని అంటే కుదరదు. చాలా బాగుండాలి. ఎందుకంటే ఆ మూవీ వెనక రూ.400 కోట్లు ఉంది. అక్కడికి పోయి నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు! అక్కడే ఏం కావాలో అదే చేశాం. బాగా జరుగుతుంది. అందుకే బాగా టైమ్ తీసుకుంటున్నాం. ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: మహేశ్ అభిమానులకు సారీ చెప్పిన హరీశ్ శంకర్)


