చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న బలగం మూవీపై ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. జబర్దస్త్ ఫేం వేణు తొలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మార్చి 3న థియేటర్లో విడుదలైన ఈ మూవీ అంచనాలను మించి విజయం సాధించింది. దీంతో ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం బలగం చిత్రాన్ని కొనియాడారు. స్వయంగా ఈ మూవీ టీంను కలిసిన చిరు దర్శకుడు వేణును అభినందించారు.
ఈ సందర్భంగా వేణును శాలువతో సత్కరించారు. ఇది నిజమైన చిత్రమని, ఇది నిజాయితితో తిశావన్నారు. తెలంగాణ సంస్కృతి ఈ చిత్రంలో ఉట్టిపడుతుందన్నారు. రియాలిటీకి ఈ సినిమా చాలా దగ్గర ఉందంటూ ప్రశసించారు. అనంతరం చిరుకి ధన్యవాదాలు తెలుపుతూ బలగం టీం ట్వీట్ చేసింది. మెగా ప్రశంస అంటూ చిరు బలగం టీంను కలిసిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. కాగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి-కావ్య కల్యాణ్ జంటగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.