
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మలయాళ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్, నటుడు జయసూర్యలపై కేరళ పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నటి మిను మునీర్ తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. తనను వేధించిన ముకేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇవ్వకూడదని కోరారు.
మోహన్లాల్ రాజీనామా.. మంచి నిర్ణయం
అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టుల)కు మోహన్లాల్ రాజీనామా చేయడంపై స్పందిస్తూ.. ఇది మంచి నిర్ణయమేనన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్కు అమ్మ బాధ్యతలు చేపట్టే అర్హత పుష్కలంగా ఉందన్నారు. కాగా ముకేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య తనను వేధించారంటూ మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది.
డబ్బు కోసం బ్లాక్మెయిల్
వీరి వేధింపుల వల్ల మలయాళ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయానంది. హేమ కమిటీ నివేదిక వెలువడిన సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ముకేశ్, జయసూర్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మరో ఐదుగురిపైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ముకేశ్ కొట్టిపారేశాడు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించాడు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని చెప్తున్నాడు.