
ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీలో నటిస్తున్నారు. అంతేకాకుండా నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలోనూ కనిపించనున్నారు.
అయితే తాజా ఇంటర్వ్యూకు హాజరైన సన్నీ డియోల్ మూవీ కలెక్షన్స్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానులు ఫేక్ కలెక్షన్స్ను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు ఎలాంటివారో తనకు అర్థం కావడం లేదన్నారు. నకిలీ బాక్సాఫీస్ నంబర్స్ చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. సినీ పరిశ్రమ ప్రమాణాల కంటే కేవలం హైప్పైనే ఆధారపడడంపై సన్నీ డియోల్ తప్పుబట్టారు.
సన్నీ డియోల్ మాట్లాడుతూ.. 'ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అభిమానులు వాస్తవికతను నమ్మడానికి ఇష్టపడరు. బాక్సాఫీస్ సంఖ్యలను పెంచి కానీ వాస్తవానికి భిన్నంగా చూపిస్తారు. టిక్కెట్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం.. నకిలీ బాక్సాఫీస్ సంఖ్యలు చూపించడం సరైంది కాదు. అది అలా ఉండకూడదు. మిమ్మల్ని మీరు హిట్ చేసుకోవడానికి ఇది మార్గం కాదు. అందువల్లే చాలా మంది యువకుల కథలు బయటకు రావడం లేదు. ప్రజలు కూడా మంచి కథకు విలువ ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో కథ ప్రభావం కంటే ఫేక్ కలెక్షన్స్ ద్వారా విజయం డిసైడ్ చేస్తున్నారు' అని అన్నారు.
సన్నీ డియోల్ చివరిసారిగా 'జాట్' చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ ద్వారానే గోపీచంద్ మలినేని హిందీలో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో రెజీనా , రణదీప్ హుడా, సయామి ఖేర్, రమ్య కృష్ణన్ కూడా నటించారు.