తమిళ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి విడాకుల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇతడికి అనుకూలంగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)
రవి మోహన్ నుంచి అతడి భార్య ఆర్తి, నెలకు రూ.40 లక్షల భరణం (మెయింటెనెన్స్) కోరింది. ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆ డిమాండ్ తిరస్కరణకు గురైంది. కేసు తుది తీర్పు వచ్చేవరకు ప్రతి నెల రూ.3 లక్షలు చెల్లించాలని రవిమోహన్ని కోర్టు ఆదేశించింది. అలానే ఈ దంపతుల ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్లని తండ్రి రవిమోహన్ కలుసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేసింది.
గత కొన్నాళ్లుగా తన పిల్లలని కలవకుండా ఆర్తి అడ్డుకుంటోందని రవిమోహన్ బహిరంగంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. తన కొడుకులకు పాఠశాలకు సెక్యూరిటీతో పంపుతున్నారని, వారు కారు ప్రమాదానికి గురైన విషయాన్ని కూడా తనకు చెప్పలేదని రవిమోహన్ గతంలో ఆరోపించారు. ఆ ప్రమాదం గురించి వేరే వాళ్ల ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని, పిల్లల గురించి ఆందోళన ఉన్నప్పటికీ వారిని కలిసే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడీ విషయంలో ఈ హీరోకి ఊరట దక్కింది.
2009 జూన్లో రవిమోహన్, ఆర్తి పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 15 ఏళ్లపాటు కొనసాగిన వీళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. 2024 సెప్టెంబరులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు రవిమోహన్ ప్రకటించారు. ఈ నిర్ణయం తనకు తెలియకుండానే తీసుకున్నారని ఆర్తి అప్పట్లో చెప్పింది. అప్పటి నుంచి ఈ విడాకులు కేసు.. భరణం, పిల్లల సంరక్షణ హక్కులు, వ్యక్తిగత ఆరోపణలు తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రవి మోహన్కి అనుకూలంగా వచ్చాయి.
(ఇదీ చదవండి: తండ్రి మరణించిన ఆస్పత్రిలోనే హీరో కన్నుమూత)


