
‘‘తొమ్మిదేళ్ల తర్వాత ‘భైరవం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. నన్ను ఎంతో గొప్పగా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను మళ్లీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరిస్తున్నాను. ఈ చిత్రంలో నా వాయిస్, డిక్షన్ మా నాన్నగారిలా (మోహన్బాబు) అనిపించిందంటున్నారు. ఇది కావాలని ట్రై చేయలేదు. అది డీఎన్ఏ. అవి ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి’’ అని మంచు మనోజ్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం ‘బ్లాక్ బస్టర్ బీభత్సం’ పేరుతో నిర్వహించిన ప్రెస్మీట్లో విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘ముగ్గురు హీరోలని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. కానీ, కథలో మూడు క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. ముగ్గురు హీరోలకి ఇది మంచి కమ్ బ్యాక్ అని ఆడియన్స్ చెప్తుంటే హ్యాపీగా అనిపించింది’’ అన్నారు.
సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా నటనకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది నా కెరీర్లో మోస్ట్ మెమొరబుల్ మూవీ’’ అని చెప్పారు. ‘‘ఇంత మాస్ క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు’’ అని పేర్కొన్నారు నారా రోహిత్. ‘‘ముగ్గురు హీరోలతో సినిమా చేసి, హిట్ సాధించాను. ఇక రీ రిలీజ్ సినిమాలను శుక్రవారం కాకుండా సోమవారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దీనిపై చర్చలు జరగాలి’’ అని కేకే రాధామోహన్ చెప్పారు.