Tollywood Producer Ashwini Dutt Overhyping the Losses of NTR’s Shakti Movie - Sakshi
Sakshi News home page

Ashwini Dutt: జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా వల్ల రూ.32 కోట్ల నష్టం.. నిర్మాత

Published Fri, May 5 2023 1:51 PM

Ashwini Dutt About Shakthi Movie Flop - Sakshi

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని.. అన్నాడో సినీ కవి. ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏ సినిమా అయినా హిట్టవ్వాలని కోరుకుంటారు. కానీ ప్రతి సినిమా హిట్టవ్వదు. ప్రేక్షకులకు నచ్చితేనే ఓటేస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. అలా కొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు సైతం బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా చతికిలపడి నిర్మాతలకు తలనొప్పి తెచ్చి పెట్టాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన శక్తి సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది.

తాజాగా ఈ సినిమా ఫలితం గురించి స్పందించాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్‌. 'ఆ రోజుల్లో పంపిణీ అంతా నిర్మాతలే చూసుకునేవారు. అందువల్ల నష్టం వస్తే నిర్మాతలు తట్టుకోలేకపోయేవారు. చేసిన అప్పులు తీర్చేందుకు ఇళ్లు, పొలాలు, భూములు అమ్ముకున్న ఎంతోమందిని కళ్లారా చూశాను. అందుకే నేను ఎప్పుడూ కొంత జాగ్రత్త పడేవాడిని. ఏదైనా సినిమా తీసి దెబ్బతిన్నప్పుడు చిరంజీవి పిలిచి కథ రెడీ చేసుకోండి, మనం సినిమా చేద్దాం అనేవారు. నాగార్జున కూడా అంతే, వేరే సినిమాలు ఆపేసి మరీ నాకోసం సినిమాలు చేసేవారు.  ఆరోజుల్లో అలా ఉండేది.

నాకు బాగా అసంతృప్తిని ఇచ్చిన సినిమా శక్తి. ఈ ఒక్క సినిమాతోనే రూ.32 కోట్లు పోయాయి. నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. అందుకే నాలుగైదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను.‌ నిజానికి ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోదామనుకున్నాను. ఇక్కడ బాగా సక్సెస్‌ అయిన చూడాలని ఉంది సినిమాను నేను, అరవింద్‌ కలిసి హిందీలో తీశాం. రూ.12 కోట్ల నష్టం వచ్చింది. అంటే చెరి ఆరు కోట్ల నష్టం. అప్పటికి ఇద్దరం ఫామ్‌లో ఉన్నాం కాబట్టి మళ్లీ వెంటనే కోలుకున్నాం' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్వినీదత్‌ ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా ప్రాజెక్ట్‌ కె(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా నిర్మిస్తున్నాడు.

చదవండి: ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి ఎన్నో వెధవ పనులు చేశా: డైరెక్టర్‌
నేను చనిపోలేదు, అలా అని రిటైర్‌మెంటూ తీసుకోలేదు: నటుడు

Advertisement
Advertisement