ట్విన్స్‌ రాకతో సంతోషం: అంకిత | Ankita Lokhande Shares Adorable Pics Welcomes Abeer And Abeera | Sakshi
Sakshi News home page

మా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది: అంకిత

Aug 11 2020 10:42 AM | Updated on Aug 11 2020 1:01 PM

Ankita Lokhande Shares Adorable Pics Welcomes Abeer And Abeera - Sakshi

అంకితా లోఖండే బిలాస్‌పూర్‌కు చెందిన విక్కీ జైన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులకు కూడా ఆమె బాగానే దగ్గరయ్యారు.

ముంబై: బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ట్విన్స్‌ రాకతో తమ కుటుంబంలో సంతోషం వెల్లవిరిసిందంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్‌ చేశారు. ‘‘అబీర్‌, అబీరాలకు స్వాగతం. ఈ కవలల రాకతో మా కుటుంబం మరింత విస్తృతమైంది. కొత్త జీవితం ఆరంభమైంది’’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. కాగా అంకితా లోఖండే బిలాస్‌పూర్‌కు చెందిన విక్కీ జైన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులకు కూడా ఆమె బాగానే దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో విక్కీ సోదరి వర్షా జైన్‌- అభిషేక్‌ శ్రీవాస్తవ దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనివ్వడంతో.. అంకిత ఈ మేరకు ఇన్‌స్టాలో నవజాత శిశువుల ఫొటోలు షేర్‌ చేసి ఆనందం పంచుకున్నారు.(రియా వేధిస్తుందని చెప్పాడు: అంకిత)  

ఇక బుల్లితెరపై ప్రాచుర్యం పొంది ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన అంకిత.. కంగనా రనౌత్‌ ‘మణికర్ణిక’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత భాగీ 3 వంటి పలు చిత్రాల్లోనూ తళుక్కుమన్నారు. కాగా అంకిత గతంలో.. ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో తనకు జోడీగా కనిపించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను ప్రేమించారు. ఆరేళ్ల పాటు కొనసాగిన వీరి బంధంలో కలతలు చెలరేగడంతో స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆ తర్వాత అంకిత విక్కీ జైన్‌కు దగ్గర కాగా.. సుశాంత్‌ నటి రియా చక్రవర్తితో బంధం కొనసాగించాడు.(‘సుశాంత్‌ భార్యవి నువ్వే అంకిత.. లవ్‌ యూ’)

ఈ క్రమంలో జూన్‌ 14న సుశాంత్‌ బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన అంకిత.. సుశాంత్‌ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. సుశాంత్‌ మృతి కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో చివరకు న్యాయమే గెలుస్తుందంటూ అతడి కుటుంబానికి మద్దతు పలుకుతున్నారు. కాగా సుశాంత్‌ ఆత్మహత్యకు రియానే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీబీఐ లోతుగా దర్యాప్తు చేపట్టింది. (‘ఏడేళ్లు తనకోసమే బతికా.. నిజం తెలియాలి’)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement