సైమా అవార్డుల వేడుక (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్–2026) బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరిగింది. తొలి రోజు తెలుగు, కన్నడ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేయగా, రెండో రోజు తమిళ, మలయాళ భాషల చిత్రాల్లో ప్రతిభ చూపిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్కు అవార్డుల ప్రదానం జరిగింది. తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు సాధించింది.
నాలుగు విభాగాల్లో ‘మిరాయ్’ సినిమాకు అవార్డులు లభించాయి. బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు వెంకటేశ్కి, ‘తండేల్’ సినిమాలోని నటన నాగచైతన్యకు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకువస్తే, ‘మిరాయ్’ చిత్రానికిగానూ తేజ సజ్జాకు క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. ఉత్తమ చిత్రంగా ‘మిరాయ్’ నిలవగా, ఉత్తమ దర్శకుడి అవార్డును ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకుగానూ అనిల్ రావిపూడి అందుకున్నారు. క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డు నటి ఐశ్వర్యా రాజేష్ (‘సంక్రాంతికి వస్తున్నాం’)కు లభించింది. 2025లో విడుదలైన దక్షిణాది సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు.


