
'మల్లేశం' సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ.. తర్వాత హిందీలో ఒకటి చేశారు. రీసెంట్గా '23' అనే తెలుగు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1991లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
అంతా కొత్త నటీనటులతో తీసిన '23' సినిమా.. మే 16 థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే రెగ్యులర్ మూవీ కాకపోవడంతో ఇది జనాల దృష్టిలో పడకుండానే బిగ్ స్క్రీన్పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం 23 చిత్రం.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. త్వరలో మన దగ్గర కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
(ఇదీ చదవండి: చిరంజీవి తల్లికి తీవ్ర అస్వస్థత!)
23 విషయానికొస్తే.. సాగర్(తేజ) ఓ పల్లెటూరిలో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలనేది కోరిక. కానీ అప్పు దొరకదు. పొగాకు కూలీ సుశీల(తన్మయి)ని ప్రేమిస్తుంటాడు. పెళ్లి కాకుండానే ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దీంతో తన ఫ్రెండ్ దాస్తో కలిసి బస్సు దోపిడీ చేయాలని అనుకుంటాడు. కానీ అది అమలు చేసే క్రమంలో ప్రయాణికులు తిరగబడతారు. అనుకోకుండా నిప్పంటుకుని 23 మంది సజీవ దహనం అయిపోతారు. తర్వాత ఏమైంది? కోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేదే మిగతా స్టోరీ.
చిలకలూరిపేట బస్సు దహనం సంఘటనతో పాటు 1991 చుండూరు మారణకాండ, 1997లో జూబ్లీహిల్స్ కారు బాంబు ఘటనని కూడా సినిమాలో చూపించారు. హంతకులకి శిక్ష పడటమే న్యాయమైతే, అందరు హంతకులూ ఉరికంబం ఎక్కుతున్నారా? అనే పాయింట్ ఆధారంగా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. రియలస్టిక్గా ఉండే చిత్రం చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
