
బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం ‘120 బహదూర్’. ఈ దేశభక్తి చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహించగా, రాశీ ఖన్నా కీలక పాత్రలో నటించారు. 1962లో జరిగిన భారత్–చైనా యుద్థం నేపథ్యంలో మేజర్ షైతాన్ సింగ్ భాటీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు.
రెజాంగ్ లా యుద్ధ సంఘటనలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. ఆదివారం ఈ సినిమా సెకండ్ టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే... భారత్–చైనా (1962) యుద్ధంలో వీరమరణం పొందిన భారత అమరవీరులను గౌరవించేందుకు 1963లో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ‘ఏ మేరే వతన్ కే లోగో’ అనే పాటను ఆలపించగా, ఈ పాట అందరి హృదయాల్లో నిలిచిపోయింది.
ఆదివారం (సెప్టెంబరు 28) లతా మంగేష్కర్ జయంతి. తాజాగా విడుదలైన ‘120 బహదూర్’ సినిమా సెకండ్ టీజర్ బ్యాక్గ్రౌండ్లో ‘ఏ మేరే వతన్ కే..’ పాట వినిపించింది. ఈ విధంగా లతా మంగేష్కర్కు ‘120 బహదూర్’ టీమ్ ప్రత్యేక నివాళిగా సెకండ్ టీజర్ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది నవంబరు 21న ఈ చిత్రం థియేటర్స్లో రిలీజ్ కానుంది.