ఒక్కో యూరియా బస్తాపై రూ. 34 బాదుడు
● రవాణ చార్జీలను ఉపసంహరించుకున్న ప్రభుత్వం
● జిల్లా రైతులపై రూ.2 కోట్ల మేర అదనపు భారం
ఎరువులపై రవాణ చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఒక్కో బస్తాపై రూ. 34 అధికంగా చెల్లించాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా పరిధిలో మొత్తం 2.94 లక్షల మేర వరి సాగవుతుండగా, ఈలెక్కన అన్నదాతలపై రూ. 2 కోట్ల మేర అదనపు భారం పడనుంది. – రామాయంపేట(మెదక్)
జిల్లాలో గతంలో కంటే ఈసారి ఎక్కువ మొత్తంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. అవసరమైన యూరియా సరఫరా విషయంలో గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా యాప్లు రూపొందించాయి. చాలా మంది రైతులకు సరైన అవగాహన లేకపోవడం, ఆండ్రాయిడ్ ఫోన్ల సమస్యతో చాలా మంది రైతులు నేరుగా వ్యవసాయ కార్యాలయాలు, సహకార సంఘాల వద్దకు వెలుతున్నారు. ఈక్రమంలో యూరియా సక్రమంగా లభించక రోడ్డెక్కుతున్నారు. గోరు చుట్టు మీద రోకలి పోటులా ప్రభుత్వ రవాణ చార్జీలను ఉపసంహరించుకుంది. దీంతో ఒక్కో బస్తాపై రూ.34 అదనపు భారం పడుతుండటంలో ఆగ్రహంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.
ఎమ్మార్పీ కంటే ఎక్కువే..
రైల్వే రేక్ పాయింట్ల ద్వారా ఎరువుల బస్తాలు నేరుగా సహకార సంఘం గోదాంలకు చేరుతున్నాయి. ఇందుకు సంబంధించి రవాణ చార్జీలను మార్క్ఫెడ్ ద్వారా ఇన్నాళ్లు ప్రభుత్వమే భరించింది. ఇటీవల ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూ. 266.50కు విక్రయించాల్సిన యూరియా బస్తాను రవాణ, లోడింగ్ చార్జీలతో కలిపి రూ.300 వరకు అమ్ముతున్నారు. నిబంధనల మేరకు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులు విక్రయించడం నేరం. ఇదిలా ఉండగా నిధుల కొరతతో పలు సహకార సంఘాలు ఎరువుల కోసం ముందుగా డీడీలు చెల్లించకుండా ఇండెంట్లు పెట్టడం నిలిపివేస్తున్నారని తెలిసింది.


