రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్
మెదక్జోన్: ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం మెదక్లోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 10న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పీఆర్సీ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరు విడతల కరువు భత్యం (డీఏ) పెండింగ్లో ఉందని, అది ఒకే దఫాలో చెల్లించాలన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల సొమ్ము ప్రభుత్వం వద్ద నిలిచిపోయి, ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. నగదు రహిత ఆరోగ్య కార్డులు అనేక ఆస్పత్రుల్లో చెల్లుబాటు కాకపోవడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పటం లేదని వాపోయారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు దామోదర్రెడ్డి, గజేందర్, అనిల్, మధుసూదన్ రెడ్డి, సోమయ్య, అబ్దుల్లా, లక్ష్మారెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


