● పది మందికి రేవంత్ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ● అధికారులు, నేతలతో మంత్రి ఉత్తమ్, జగ్గారెడ్డి సమీక్ష
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో ఈ నెల 15న జరుగనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగసభకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ఈ సభ ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి మంగళవారం సెక్రటేరియల్లో మంత్రి సమీక్షించారు. కలెక్టర్ ప్రతీక్జైన్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ...సీఎం ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జిల్లాలో ఉంటారన్నారు. ఈ సభా వేదికపై ఉమ్మడి జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒక లబ్ధిదారుడి చొప్పున పది మంది లబ్ధిదారులకు సీఎం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఉత్తమ్ కలెక్టర్ను ఆదేశించారు.


